Andhra Pradesh: ఆ కొండల మాటున మళ్ళీ డ్రోన్ల చక్కర్లు.. ఎందుకో తెలుసా..?!

అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు పోలీసులు. మాయని మచ్చగా మారిన గంజాయిపై.. యుద్ధమే ప్రకటించారు.

Andhra Pradesh: ఆ కొండల మాటున మళ్ళీ డ్రోన్ల చక్కర్లు.. ఎందుకో తెలుసా..?!
Police Focus On Ganja
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Oct 15, 2024 | 11:38 AM

అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు పోలీసులు. మాయని మచ్చగా మారిన గంజాయిపై.. యుద్ధమే ప్రకటించారు. సరికొత్త యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. అందుకోసం ఇప్పటికే పాత గంజాయి కేసుల్లో పట్టుబడిన వారు, గంజాయి పంటను సాగు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దిశగా ఓ వైపు కఠినంగా వ్యవహారిస్తూనే, మరోవైపు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.

గంజాయి పంటను పండించే రైతులను మోటివేట్ చేయడం ద్వారా గంజాయికి దాదాపుగా బ్రేక్ వేయవచ్చన్నది పోలీసుల భావన. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల వైపు దారి చూపిన పోలీసులు, అధికారులు.. చాలావరకు గంజాయి సాగును కంట్రోల్ చేశారు. కానీ ఇంకా ఎక్కడో అక్రమార్కుల మాటల్లో పడి.. గిరిజనులు మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో ఇక అధునాతన డ్రోన్లను రంగంలోకి దింపారు. కొండలు, లోయలో మధ్య గుట్టుగా సాగుతున్న గంజాయిని గుర్తించే పనిలో పడ్డారు. పంటను సాగు చేస్తున్న వారిపై ఇక నుంచి యాక్షన్ మామూలుగా ఉండదని సాఫ్ట్ గా సూచనలు జారీ చేస్తున్నారు పోలీసులు.

పోలీస్ అధికారులదే పైచేయి

అధికారులు పై చేయిఅల్లూరు ఏజెన్సీలో గంజాయి సాగుపై దాదాపుగా పోలీసులు, అధికారులు పై చేయి సాధించినప్పటికీ.. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఇంకా మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతుందనేది పోలీసులకు వచ్చిన సమాచారం. వాగులతో పాటు కొండ కోనల మధ్య మత్సగడ్డ పరివాహక ప్రాంతాల్లో గంజాయి అక్కడక్కడ గుట్టుగా సాగు జరుగుతుందని పోలీసులకు ఇంటలిజెన్స్ సమాచారం. అయితే ఆయా ప్రాంతాలకు పోలీసులు వెళ్లలేని పరిస్థితి. దట్టమైన అడవులు, కొండలు, లోయలతో ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే పోలీసులు ప్రత్యేకంగా సాహసం చేయాల్సిందే. దీంతో ఒకవైపు గిరిజనులకు అవగాహన కల్పిస్తూనే, డ్రోన్లను రంగంలోకి దించారు పోలీసులు.

సరిహద్దుల్లో ఏపుగా పెరుగుతున్న గంజాయి

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ 11 మండలాలు కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది. అయితే ఏజెన్సీలో ప్రధాన సమస్య గంజాయి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఈ గంజాయి ఏపుగా పెరుగుతుంది అనేది నిత్య సత్యం. ఏపీ బోర్డర్లో చాలావరకు గంజాయి సాగు తగ్గించినా.. ఒడిస్సా సరిహద్దుల్లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అంతరాష్ట్ర స్మగ్లర్లు అల్లూరి మన్యంలో పండే గంజాయి కన్నేసి.. గిరిజనులకు మాయమాటలతో మచ్చిక చేసుకుని, కోట్ల రూపాయల గంజాయిని తరలించిపోతున్నారు.

గంజాయి యాక్షన్ ప్లాన్..

అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా.. ఆపరేషన్ గంజాయి సరికొత్త యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణా, సాగు చేస్తూ పదేళ్లుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి కేసులు నమోదైన వారిని ఇప్పటికే బైండోవర్ చేశారు పోలీసులు. ఇక ముందు గంజాయి కేసులో పట్టుపడితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామని, అంతేకాదు రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఒకానొక దశలో ఈ గంజాయి మాకొద్దు బాబు అంటూ.. గిరిజనులు ప్రతిన పూనేలా చేశారు. అయినా.. మళ్లీ మారుమూల ప్రాంతాల్లో గంజాయి మూలాలు కలవర పాటుకు గురిచేస్తున్నాయి.

రంగంలోకి అధునాతన డ్రోన్లు..

అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో గంజాయి సాగుపై డ్రోన్లతో నిఘా పెట్టారు పోలీసులు. కొండలు, గుట్టలు, లోయల మాటున దాగి ఉన్న గంజాయిని ప్రత్యేకంగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. జిల్లా పోలీస్ సూపరిండెంట్ అమిత్ బర్దర్ ఆదేశాలతో స్వయంగా పాడేరు ఏఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల బృందం రంగంలోకి దిగారు. కొండల మాటున లోయల్లో గంజాయి సాగుపై నిఘా పెంచారు. గతంలో పాడేరు, హుకుంపేట మండలాల్లో గంజాయి సాగుతున్నట్టు గుర్తించి 9మందిపై ఇటీవల కేసులు పెట్టిన సంగతి తెలిసిందే..!

ఆ సాగు ఎక్కడెక్కడంటే..!

పాడేరు, హుకుంపేట మండలాల్లో అధునాతమైన డ్రోన్లు సహాయం తో కొండ మూలల్లో ఉన్న గంజాయిని గుర్తించి గంజాయి పంట వేసిన వారిపై చర్యలు తీసుకున్నందుకు సిద్ధమయ్యారు పోలీసులు. గతేడాది ఇదే సీజన్లో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పాడేరు, హుకుంపేట మండలాల్లో 8 కేసులు నమోదు చేసి తొమ్మిది మంది పంట వేసిన వారిని అరెస్టు చేశారు. ఇందులో పాడేరు కించూరు పంచాయతీ బోంగజంగి లో ఒక కేసు, తొట్లగొంది లో ఒక కేసు , ఇరాడపల్లి పంచాయతీ సరియపల్లి లో ఒక కేసు గంజాయి రైతుల పైన నమోదు చేశారు. అలాగే హుకుంపేట మండలం లో తీగలవలస పంచాయతి ఒలుబెడ్డ గ్రామంలో రెండు కేసులు , మత్యపురం పంచాయతీ పెడబోరుగుల గ్రామంలో రెండు కేసులు , గన్నేరుపుట్టు పంచాయతీ పోర్లు గ్రామం లో ఒక కేసు నమోదు అయ్యాయి. తాజాగా మళ్లీ పాడేరు హుకుంపేట మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సాధించారు పోలీసులు. అలాగే చింతపల్లి, అరకు ఏజెన్సీ మారుముల ప్రాంతాల పైనా నిఘా పెంచారు.

మళ్లీ డ్రోన్ల చక్కర్లు

పాడేరు ఏజెన్సీలో మళ్ళీ పోలీసుల డ్రోన్ల చక్కర్లు కొడుతున్నాయి. పాడేరు మండలం సంగోడి, సందిగెడ్డ, సప్పపుట్టు, కించురు, వల్లాయి, బడిమెల, గొండేరు గ్రామాల పరిసర ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు పోలీసులు. కొండల మధ్యలో మారుమూల ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రోన్లతో తనిఖీలు చేశారు. గంజాయి అనర్ధాలపై గిరిజనులకు పోలీసుల అవగాహన కల్పించ్చారు. సాగు, రవాణా, వినియోగానికి దూరంగా ఉండాలని సూచనలు జారి చేశారు. జీవితాల్ని నాశనం చేసే గంజాయి పంటకు గిరిజనులు దూరంగా ఉండాలని, లేకుంటే రైతుల పైన పోలిసు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తామని అంటున్నారు పోలీసులు.

మన్యానికి మాయని మచ్చగా మారిన గంజాయి సాగు

అయితే పోలీసులకు ఎన్ఫోర్స్మెంట్ వర్గాలకు పట్టుబడుతున్న వారు గిరిజనులే అయినప్పటికీ.. దీని వెనుక అంతర్రాష్ట్ర ముఠామే పని చేస్తున్నాయి అన్నది నిఘా వర్గాల సమాచారం. అయినప్పటికీ.. గంజాయిని సాగులోనే తుంచేస్తే.. సరిహద్దులో దాటదనేది పోలీసుల భావన. అందుకే ఇప్పటివరకు గంజాయి సాగు చేస్తున్న రైతులు, స్మగ్లర్లకు సహకారం అందిస్తున్న గిరిజనులను మోటివేట్ చేస్తూ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపించారు పోలీసులు. గంజాయికి దూరంగా ఉండాలని చాలాసార్లు సూచించారు. అయినాప్పటికీ.. గుట్టుగా కొండలలోయల మధ్య గంజాయి సాగు చేస్తున్న వారిపై ఇక కఠిన చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. ఆల్లూరి మన్యానికి మాయని మచ్చగా మారిన గంజాయి సాగును పూర్తిగా నియంత్రించి గంజాయి ఫ్రీ ఏజెన్సీగా చేసేందుకు సహకరించాలని కోరుతున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..