ఏలూరు, జనవరి 28: సర్వ విఘ్నాల నుంచి కాపాడే దేవుడు విఘ్నాదిపతి వినాయకుడు. ఎక్కడైనా ఎప్పుడైనా తొలి పూజ ఆయనికే చేయడం సాంప్రదాయం. అయితే ఇటీవల కాలంలో వినాయకుడికి ప్రత్యేకత సంతరించుకుంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు అనేక రూపాల్లో వున్న బోజ్జ గణపయ్యని మలచి పూజలు నిర్వహిస్తున్నారు. కొందరైతే ఏకంగా ఫేమస్ హీరోలు వేసిన గెటప్ల ఆధారంగా తయారుచేసిన బాహుబలి వినాయకుడు, అదేవిధంగా పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ గెటప్ లో తయారు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహాలు ఎంతో ఫేమస్ అయ్యాయి. అలా మలచిన విగ్రహాలకు ఎంతో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఉత్సవాల చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం వినాయక చవితి టైం కాదు.. ఇప్పుడెందుకు ఈ టాపిక్ వచ్చింది అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదివితే వినాయకుని మరొక కొత్త రూపం గురించి మనకు తెలుస్తుంది. అయితే ఆ వినాయకుడు మద్ది చెట్టు పేరులో ఉండడం ప్రస్తుతం ఇక్కడ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం పక్కన మద్ది చెట్టు క్రింది భాగంలో విపరీతంగా వేర్లు బయటికి చోచ్చుకుని వచ్చాయి. అయితే అలా బయటికి వచ్చిన మద్ది చెట్టు వేర్ల రూపం అచ్చం వినాయకుడిని పోలి ఉంది. దాంతో అది సాక్షాత్తుభగవంతుడు వినాయకుడు మహిమేనని, తన భక్తుల కోరికలు తీర్చేందుకు మద్ది చెట్టులో వేర్ల రూపంలో మనకు సాక్షాత్కారమయ్యారని భక్తులు విశ్వసిస్తున్నారు.
అంతేకాకుండా వినాయకుడిని వినాయకుడిని పోలి ఉన్న మద్ది చెట్టు వేర్లకు పసుపు కుంకుమ పెట్టి, పూలు జల్లి కర్పూర నీరాజనాలు సమర్పించి హారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మద్ది చెట్టు వేర్ల రూపంలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడనే వార్త ఆ నోట ఈ నోట పాకి ఆ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పెద్ద పెద్ద క్యూ లైన్లు కట్టి బారులు తీరి మరి ఆ వినాయకుడిని కొలుస్తున్నారు. దాంతో మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణమంత భక్తులతో కిటకిటలాడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.