Cyclone Ditwah: ఏపీపై ఉరుముతున్న తుఫాన్.. బాబోయ్.! ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుఫాన్.. తమిళనాడు వైపు కదులుతోంది. తమిళనాడులో తీర ప్రాంత జిల్లాలకు సమాంతరంగా కదలుతోందీ తుఫాన్.. పుదుచ్చేరి, చెన్నైపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే చెన్నై, పుదుచ్చేరిలో బీచ్‌లు మూసివేశారు. ఆ వివరాలు ఇలా..

Cyclone Ditwah: ఏపీపై ఉరుముతున్న తుఫాన్.. బాబోయ్.! ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
Andhra Weather Report

Updated on: Nov 30, 2025 | 7:53 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను.. భారత్ వైపు వేగంగా కదులుతోంది. గడచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో తుఫాను గమనం సాగుతోంది. కారైకల్ కు తూర్పున 80 కి.మీ., వేదరన్నియం కు తూర్పున 100 కి.మీ., చెన్నైకు 250, పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తుఫాను.. మరికొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత సమీపానికి చేరుకోనుంది. తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ.

ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు.

అటు తెలంగాణ విషయానికొస్తే.. దిత్వా తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల సమీపంలోకి చేరుకుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. అలాగే రాష్ట్రంలోని భద్రాచలంలో అత్యధికంగా 17 డిగ్రీలు.. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.