CPI Narayana: ఏపీ అసెంబ్లీ ఘర్షణపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్.. ఆ ఇద్దరూ క్షమాపణలు చెప్పాలంటూ..

|

Mar 20, 2023 | 3:31 PM

టీడీపీ ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు మనుషులా..? పశువులా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరి..

CPI Narayana: ఏపీ అసెంబ్లీ ఘర్షణపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్.. ఆ ఇద్దరూ క్షమాపణలు చెప్పాలంటూ..
Cpi Narayana
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు (సోమవారం) అసెంబ్లీలో జరిగిన ఉద్రిక్తతపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు మనుషులా..? పశువులా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉందన్నారు. ఆరు, ఏడు తరగతుల వాళ్లకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆక్షేపించారు. అయినా సరే ఓడిపోవడంతో వైసీపీ నేతలు నిరాశలో ఉండిపోయారు. అందుకే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా..? అని ప్రశ్నించారు.  ఈ విషయంలో స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉందని,ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

అయితే ఈ రోజు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల వైఖరిని తప్పుబడుతూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేసి, 11 మంది టీడీపీ సభ్యులను ఓ రోజు సస్పెండ్ చేసారు.

ఇవి కూడా చదవండి

దీనిపై మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని, టీడీపీ మూడు ఎమ్మెల్సీలు గెలవడంతో వైసీపీకి మతి పోయిందన్నారు. 75 ఏళ్ల వ్యక్తి అయిన బుచ్చయ్య చౌదరిపై, డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడి చేయడం దారుణం అని అన్నారు. సీటులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై మాజీ మంత్రి వెల్లంపల్లి దాడి చేశారని ఆరోపించారు. ఘర్షణకు సంబంధించిన మినిట్ టు మినిట్ వీడియోను స్పీకర్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌పై తాము దాడి చేసి ఉంటే మమ్మల్ని అసెంబ్లీలోనే ఉరి తీయండని పేర్కొన్నారు.

అలాగే అసెంబ్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఇది శాసనసభ కాదు… కౌరవ సభ’ అంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కారణంగా జగన్‌కు పిచ్చెక్కుతుందని చురకలు అంటించారు. ఏపీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజని ఆయనపేర్కొన్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..