
సీఎం జగన్ మేమంతా సిద్ధం 12వ రోజు యాత్ర పల్నాడుజిల్లా గంటావారిపాలెం నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఉదయాన్నే సీఎంను కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు అక్కడికివచ్చిన వారితో మాట్లాడారు. కొందరి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్తో కరచాలనం కోసం అభిమానులు ఎగబడ్డారు. అందరికీ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు.
పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, అన్నవరప్పాడు దాటి రొంపిచర్లకు చేరుకుంది. దారిపొడవునా జగన్కు అపూర్వ స్వాగతం లభించింది. స్థానికులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. రొంపిచర్ల హైవేపై జగన్ యాత్రకు విశేష స్పందన వచ్చింది. అంతకుముందు సంతమగులూరు క్రాస్రోడ్ సర్కిల్లో సీఎం జగన్.. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
అన్నవరప్పాడులో భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. గుమ్మడికాయలతో దిష్టితీశారు మహిళలు. విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వరకూ బస్సు యాత్ర సాగుతుంది.
CM జగన్ని కలిసేందుకు చెప్పులు లేకుండా కాన్వాయ్ వెంట పరుగులు తీసింది వెంకాయమ్మ అనే మహిళ. ఆమెను చూసి కాన్వాయ్ ఆపారు సీఎం. ఆమెను పిలిచి మాట్లాడారు. రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ.. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎండను కూడా లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఇవాళ అయ్యప్పనగర్ బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. సభ తర్వాత కొండమోడు జంక్షన్, అనుసాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్లకు చేరుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..