AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: గంటగంటకు 5 నిమిషాలు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్.. చంద్రబాబును ప్రశ్నించనున్న 9మంది సీఐడీ అధికారులు..

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబును మరో రెండు రోజుల పాటు విచారించే అవకాశం దొరికింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓ క్వశ్చన్‌ పేపర్‌ను కూడా వాళ్లు తయారు చేసుకునే ఉంటారు. అయితే విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Chandrababu Arrest: గంటగంటకు 5 నిమిషాలు, మధ్యాహ్నం లంచ్ బ్రేక్.. చంద్రబాబును ప్రశ్నించనున్న 9మంది సీఐడీ అధికారులు..
Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Sep 23, 2023 | 6:50 AM

Share

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబును మరో రెండు రోజుల పాటు విచారించే అవకాశం దొరికింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓ క్వశ్చన్‌ పేపర్‌ను కూడా వాళ్లు తయారు చేసుకునే ఉంటారు. అయితే విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చంద్రబాబును ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసును కొన్నేళ్లుగా విచారిస్తున్న అధికారులు బాబును పలు రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.వాస్తవానికి చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజే సుమారు 8 గంటలపాటు బాబును ప్రశ్నించారు అధికారులు. 20 ప్రశ్నలను చంద్రబాబు ముందు ఉంచారు. అయితే సరైన సమాధానాలు చెప్పలేదంటోంది సీఐడీ. ఇదే విషయాన్ని కోర్ట్‌లోనూ ప్రస్తావించారు. ఇప్పుడు రెండు రోజుల పాటు ఎన్ని ప్రశ్నలు వేయనున్నారు. వాటికి బాబు సమాధానం ఏంటనేది ఆసక్తిగా మారింది.

విచారణ ఇలా..

ఇవాళ ,రేపు సీఐడీ కస్టడీలో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలో 9 మంది విచారణ బృందం మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనుంది. 9:30 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం కానుంది. విచారణ అధికారులుగా ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో పాటు ఎఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లోనే సీఐడీ బృందం విచారించనుంది. ఏసీబీ కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగనుంది.విచారణ మొత్తాన్ని ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు టైపిస్టులు రికార్డ్ చేయనున్నారు. చంద్రబాబు తరుపు న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనుంది. విచారణలో ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్.. మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.

కీలక అంశాలపై ఫోకస్..

అయితే, చంద్రబాబుని ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 30కి పైగా అంశాలపై సీఐడీ బృందం ప్రశ్నించనుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో బాబుపై 34 అభియోగాలు మోపిన సీఐడీ.. తప్పుడు పత్రాలు సృష్టించటం, నిధులు మళ్లింపు, సిమన్స్ ఒప్పందం, జిఓ 4, నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ, ఆధారాలు డిస్ట్రాయ్ చెయ్యటం, 13 నోట్ ఫైల్స్‌పై బాబు సంతకాలు, ఐటీని లెక్కచెయ్యకపోవటం, షెల్ కంపెనీలు, అధికారులపై ఒత్తిడి లాంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ఫైల్స్‌ను చంద్రబాబు ఎదుట పెట్టి విచారించేందుకు సీఐడీ సిద్ధమైంది. ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనే దానిపై ఇప్పటికే ఫోకస్ చేసిన సీఐడీ.. లోకేష్, కిలారి రాజేష్, పీస్ శ్రీనివాస్ పాత్రపై కూడా విచారించనుంది.

సరైన సమాధానం చెప్తే ఓకే.. విచారణకు సహకరించకపోతే చంద్రబాబుకే నష్టమంటున్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే సీఐడీ కస్టడీ కోరిందని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. అరెస్ట్ చేసిన రోజే 8 గంటలపాటు విచారించారు.. ఇప్పుడు మళ్లీ విచారించడానికి ఏముందని ప్రశ్నించారు.

కస్టడీ పూర్తైన తర్వాత రిపోర్ట్‌ను ఏసీబీ కోర్ట్‌కు అధికారులు సమర్పించనున్నారు. వాళ్లిచ్చే రిపోర్ట్‌ ఆధారంగా.. తదనంతర పరిణామాలు ఉండనున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..