Polavaram Project: ఆ ఖర్చు మేమే భరిస్తాం.. పోలవరం ప్రాజెక్టుపై ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..

Central Govt On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభవార్త అందింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా భరిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం..

Polavaram Project: ఆ ఖర్చు మేమే భరిస్తాం.. పోలవరం ప్రాజెక్టుపై ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..
Polavaram Project

Updated on: Jul 31, 2023 | 8:36 PM

ఢిల్లీ, జులై 31: పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి శుభవార్త అందింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగునీటి విభాగం పనులకు మాత్రమే నిధులు ఇస్తామని ఇన్నాళ్లూ మొండికేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు తాగునీటి విభాగం కోసం చేసే ఖర్చును కూడా భరిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ప్రతిపాదిత వ్యయాన్ని తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి 55వేల 548 కోట్ల రూపాయల నిధుల గురించి విజయసాయి ప్రశ్నించగా.. జలశక్తి మంత్రి శ్రీ బిశ్వేశ్వర్‌ తుడు జవాబిచ్చారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి 10వేల 911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణం మరమ్మతుల కోసం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు ఆర్థికశాఖ ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని మంత్రి స్పష్టం చేశారు.

అయితే, కాంపోనెంట్‌వారీగా నిధుల చెల్లింపువల్ల ప్రాజెక్ట్‌ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని.. చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం జగన్‌ తన ఢిల్లీ పర్యటనల్లోనూ పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. కాంపోనెంట్‌ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయవిభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు.. రాజ్యసభలో మంత్రి బిశ్వేశ్వర్‌ వెల్లడించారు.

కాగా.. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీకి మేలు జరగనుంది. దీని కారణంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు రానున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలనే నిధులు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా.. ఈ నిర్ణయం తీసుకోవడం ఏపీకి కలిసివచ్చే అంశంగా పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..