గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. జూలై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని.. దాని ఆధారంగానే వేతనాలను చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. ఉద్యోగులందరూ కూడా కార్యాలయానికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని సూచించారు.
అలాగే సెలవులకు దరఖాస్తును ఇక నుంచి హెఆర్ఎంఎస్లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. అటు ప్రతీ రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి ప్రజల వినతులను తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు డ్యూటీలో భాగంగా సమావేశాలకు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని భరత్ గుప్తా తెలిపారు. కాగా, రేపట్నుంచి బయోమెట్రిక్ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేపట్నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న 8(అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం) జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉండనుంది. ఈ ఆంక్షలు జూలై 1 నుంచి 7 వరకు వర్తించనున్నాయి.
Also Read:
ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..