ఏపీలో రానున్న 3 రోజుల వెదర్ ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్ ఇదే..
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు వర్షాలు, బలమైన గాలులు కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశముంది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

అమరావతి వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు కీలక వాతావరణ సూచన జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోంది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది దక్షిణం వైపు వంగి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రాంతం రాబోయే 24 గంటల్లో దక్షిణ ఉత్తరప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవస్థ ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.
తాజా వాతావరణం మీ నగరాల్లో..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గురువారం నుంచి శనివారం వరకు అంటే సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాయలసీమలో కూడా సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షాలు, బలమైన ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గాలుల సమయంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
