Weather Update: బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో విచిత్ర వాతావరణం.. ఏ జిల్లాలో ఎలా ఉండబోతుందంటే?
ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదుకానున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు, మరి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని.. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరి కొన్ని జిల్లాలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రెండ్రోజులు కూడా రాష్ట్రంలో వాతావరణం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాలు, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం రాష్ట్రంలో వాతావరణం ఇలా
గురువారం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, బొండపల్లి, రామభద్రాపురం మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం మండలాలు, అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల్లో తీవ్రవడగాల్పులు, మరో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా మరోవైపు ద్రోణి ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
బుధవారం రాష్ట్రంలో వాతవరణం ఇలా
బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల పరిధిలోని 88 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
