Andhra Pradesh: తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్.. అలా చేస్తేనే వీరి అకౌంట్లోకి డబ్బులు.. రెండు రోజులే టైమ్..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది. దీంతో బ్యాంక్ అకౌంట్, ఎన్పీసీఐ సీడింగ్పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులను జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సొమ్మును ఈ నెల 16,17,18వ తేదీల్లో లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు వీటిని అందించనుంది. ప్రభుత్వం, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో వీటిని నేరుగా జమ చేయనుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు అందిస్తుండగా.. స్కూల్స్ నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 వేలు తీసుకుంటుంది. మిగతా రూ.13 వేలు తల్లిదండ్రులకు పంపిణీ చేయనున్నారు.
ఈ విద్యార్థులకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి
అయితే ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని సూచించింది. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పాన్ కార్డు లేకపోయినా విద్యార్థుల పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటివి తీసుకెళ్లి ఖాతా ఓపెన్ చేయవచ్చు. కేవలం రూ.200 నామమాత్రపు అమౌంట్ జమ చేసి పోస్టాఫీసులో అకౌంట్ తెరవొచ్చు. అలాగే 18 ఏళ్లలోపు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇందుకోసం వారి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలి. దీంతో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు.
ఎన్పీసీఐ సీడింగ్ తప్పనిసరి
ఎన్పీసీఐ సీడింగ్ చేసుకోకపోతే డీబీటీ ప్రక్రియ ద్వారా డబ్బులు అకౌంట్లో పడవు. దీంతో అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సమీప అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు చాలామందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. కొంతమందికి ఉన్నా ఎన్పీసీఐ సీడింగ్ చేయలేదు. దీని వల్ల తల్లికి వందనం డబ్బులను కోల్పోయే ప్రమాదముంది. వీరిలో పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేయించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. పోస్టాఫీసులో అకౌంట్ తెరిస్తే 24 గంటల్లోనే ఎన్పీసీఐకు అనుసంధానం అవుతుంది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా వెంటనే అకౌంట్ తెరవాలని ప్రభుత్వం సూచించింది. ఒకసారి అకౌంట్ తెరిస్తే ఇంటర్ సెకండియర్లో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.
