Andhra Pradesh: మరోసారి ఏపీ ఉద్యోగుల పోరుబాట.. ఆలోపు సమస్యలు పరిష్కరించాలని సర్కారుకు అల్టిమేటం

తమ సమస్యలపై ఏడాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Andhra Pradesh: మరోసారి ఏపీ ఉద్యోగుల పోరుబాట.. ఆలోపు సమస్యలు పరిష్కరించాలని సర్కారుకు అల్టిమేటం
Bopparaju Venkateswarlu

Updated on: Feb 25, 2023 | 6:45 AM

ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈసారి ఏకంగా ప్రభుత్వానికి అల్టిమేటమే ఇచ్చారు. ఈనెల 26లోపు తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాగా తమ సమస్యలపై ఏడాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు ఏపీ రెవెన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 11వ పీఆర్సీ అమలు చేశామని చెబుతున్నా తమకెలాంటి బెనిఫిట్‌ అందలేదన్నారు. 2018 నుంచి రావాల్సిన 6 డీఏలు, పీఆర్సీ బకాయిల్లో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రిటైరైన ఉద్యోగులకు కూడా బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు బొప్పరాజు. వీఆర్‌ఏలకు ఇస్తున్న డీఏలను వెనక్కి తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచకుండా అన్యాయం చేశారంటూ అనేక సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రభుత్వానికి ఈనెల 26వరకు టైమిస్తున్నామని, ఆలోపు సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులను హింస పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదంటూ సర్కారుపై మండిపడుతున్నారు. సంక్రాంతి నాటికి బకాయిలు ఇస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని.. ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీపీఎస్ వాటా డబ్బులు 11 నెలలుగా ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపణలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..