‘బైక్‌పై వెనక సీటులో కూర్చున్న వ్యక్తి కూడా బీమాకు అర్హుడే..’ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

2004 నవంబరు నెల అనంతపురం జిల్లాలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదానికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు.కేసు వివరాల్లోకి వెళ్తే.. నవంబరు 2004లో అనంతపురం జిల్లాకు చెందిన శివశంకర్‌, శివకేశవులు ఓ బైక్‌పై, సాకే ముత్యాలు, దాసరి బోడప్ప(వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి) మరొక బైక్‌పై..

బైక్‌పై వెనక సీటులో కూర్చున్న వ్యక్తి కూడా బీమాకు అర్హుడే.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
Bike Insurance

Edited By:

Updated on: Aug 06, 2023 | 6:50 PM

అమరావతి, ఆగస్టు 6: ఇన్సూరెన్స్ ప్రమాద బీమా అంశంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ప్యాకేజీ పాలసీ’ తీసుకున్నప్పుడు ద్విచక్రవాహనం వెనక సీటుపై కూర్చొన్న వ్యక్తికీ బీమా వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులు అప్పీల్‌ చేయకపోయినప్పటికీ పరిహారం పెంచే అధికారం ఉన్నత న్యాయస్థానానికి ఉందని తేల్చి చెప్పింది.

2004 నవంబరు నెల అనంతపురం జిల్లాలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదానికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు.కేసు వివరాల్లోకి వెళ్తే.. నవంబరు 2004లో అనంతపురం జిల్లాకు చెందిన శివశంకర్‌, శివకేశవులు ఓ బైక్‌పై, సాకే ముత్యాలు, దాసరి బోడప్ప(వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి) మరొక బైక్‌పై అనంతపురం బయలుదేరారు. ముందు వెళుతున్న బైక్‌ను సాకే ముత్యాలు ఢీకొట్టడంతో నలుగురూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాసరి బోడప్ప మృతిచెందారు. పరిహారం కోసం మృతుడి కుటుంబసభ్యులు బీమా కంపెనీకి దరఖాస్తు చేయగా.. అందుకు యునైటెడ్ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ నిరాకరించింది..

దీంతో మోటారు ప్రమాద బీమా క్లైమ్‌ల ట్రైబ్యునల్‌/ అనంతపురం ఐదో అదనపు జిల్లా కోర్టును బాధితులు ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు చెప్పిన ట్రైబ్యునల్.. రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని 2008లో ఆదేశించింది. ఈ తీర్పును అదే ఏడాది హైకోర్టులో యునైటెడ్‌ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ సవాల్ చేసింది. అదనపు ప్రీమియం చెల్లించలేదని, వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి బీమా వర్తించదని ఆ సంస్థ తరఫు లాయర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ వెంకటరమణ.. సదరు సంస్థ వాదనలను తోసిపుచ్చారు.

ఇవి కూడా చదవండి

ద్విచక్ర వాహనానికి ‘ప్యాకేజీ పాలసీ’ తీసుకొని ఉంటే వెనుక సీటులో ఉన్నవారికీ ప్రమాద బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీమా పరిహారం కేసుల్లో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను న్యాయమూర్తి ప్రస్తావించారు. బీమా సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను ఆయన తిరస్కరించారు. అంతేకాదు, పరిహారాన్ని కూడా రూ.2 లక్షల నుంచి రూ.9.18 లక్షలకు పెంచిన న్యాయమూర్తి.. ఆ సొమ్మును వాహన యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా చెల్లించాలని జస్టిస్ దుప్పల వెంకటరమణ ఆదేశాలు జారీచేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.