Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయన తనయుడు లోకేష్పై ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తండ్రీకొడుకులిద్దరూ కలిసే రాష్ట్రంలో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసానికి కుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడప జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేస్తాడనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులాలు, మతాలు, ఫ్యాక్షన్ను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్గా చంద్రబాబు నిలుస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మంచి చేయాలనుకున్న ముందు రోజో.. ఆ మరుసటి రోజో ఏదో ఒక హింసాత్మక ఘటన చోటు చేసుకుందని శ్రీకాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. పిఠాపురంలో 23 విగ్రహాల ధ్వంసం,అంతర్వేదిలో రథం దగ్ధం అవటం, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి ప్రతిమల అదృశ్యం, నాయుడు పేటలో ఆంజనేయుని విగ్రహం ధ్వంసం, నరసరావుపేటలో సరస్వతి ఆలయంలో విగ్రహం కూల్చివేత వంటివన్నీ చంద్రబాబు సృష్టించినవే అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పక్కా ప్రణాళికతో చంద్రబాబు, లోకేష్ల ప్రోద్బలంతోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. తన రాజకీయ స్వార్థం కోసం పుష్కరాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన చంద్రబాబుకు.. విగ్రహాల ధ్వంసం పెద్ద విషయం కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also read:
TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు