AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి..

AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!
Andhra Pradesh Weather

Updated on: Aug 10, 2026 | 8:20 AM

అమరావతి, ఆగస్ట్‌ 10: ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి నారాయణ తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమవారం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకటి, రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి

మరోవైపు శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు గిరిజన మహిళలు మృతి చెందారు. బుడార్సింగి పంచాయతీ పరిధిలోని పడంగో గ్రామంలో ఆదివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న కార్మికుల సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో పడంగో గ్రామానికి చెందిన కె. సోముద్రి (44), పాతకోటకు చెందిన సవర జోర (45) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు మహిళలు మజ్జి దేవకి, బుయా పోరోమి, కుమారో నీలా, కట్టువ సుస్మిత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గిరిజన నేతలు కోరుతున్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us