
మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన 6 వేల పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే పోస్టింగులు ఇస్తామని అన్నారు.
గత ఐదు ఏళ్లలో పోలీస్ శాఖలో ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదని.. కూటమి ప్రభుత్వం రిక్రూట్ చేసిన ఉద్యోగాలకు త్వరలో పోస్టింగ్ ఇచ్చి విధుల్లోకి చేరేలా చూస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, క్వార్టర్ల అభివృద్ధిపై కూడా దృష్టిపెడతామని తెలిపారు. రాష్ట్రంలోని పోలీసులు, వారి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ డీఏ మంజూరు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ కలిసి పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.