Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఉగాది గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ.. త్వరలోనే ప్రకటన..
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. గత ఏడాది 16 వేల పోస్టులను భర్తీ చేయగా.. ఈ ఏడాది మరికొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. 3 వేలకుపైగా పోస్టులను ఈ సారి భర్తీ చేయబోతుంది.

ఏపీలోని నిరుద్యోగులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. ఈ ఏడాది మరో డీఎస్సీ నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు నిరుద్యోగులకు ఉగాది గిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. మార్చి 19న తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ప్రారంభం కానుండగా.. ఆ రోజున డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఏపీ విద్యాశాఖ ఖాళీల వివరాలను సేకరిస్తుండగా.. దాదాపు 3,600 ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ పోస్టులకు మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. ప్రతీ ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
3600 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆదర్శ, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, సంక్షేమ శాఖల స్కూళ్లల్లో 1200 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్, ప్రభుత్వ స్కూళ్లల్లో 1,700 ఖాళీ ఉన్నాయి. ఇక ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 3600 వరకు పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16,347 పోస్టుల భర్తీని ఇప్పటికే చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్ ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఇక కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న టీచర్లకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది.
డీఎస్సీ సిలబస్పై ప్రకటన
గత ఏడాది డీఎస్సీ పరీక్షకు సిద్దం చేసిన సిలబస్నే ఈసారి డీఎస్సీకి అమలు చేయనున్నారు. పరీక్ష సిలబస్లో ఎలాంటి మార్పులు లేవని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సిలబస్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే తొలుత అభ్యర్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్ ప్రావీణ్యం టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ సమయం లేనందున ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గింది. అటు ప్రత్యేక అవసరాలు ఉన్న స్కూళ్లల్లో దాదాపు 2,600 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. పదేళ్ల సర్వీస్, టెట్లో పాస్ అయిన వారికి డీఎస్సీలో వెయిటేజీ కల్పించనున్నారు. ఇక వీరికి మినిమం టైం స్కేల్ అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండటంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటినుంచేే ఉద్యోగులకు ప్రిపేరేషన్ మొదలుపెట్టారు.
