Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రావడం లేదా..? ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన.. వారికి కూడా ఆర్ధిక సాయం
తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారందరికీ ఆర్ధిక సాయం అందిస్తామని అన్నారు. అర్హత ఉండి సాయం అందనివారు ఉంటే వివరాలు ఇవ్వాలని కోరారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ ఈ ప్రకటన చేశారు.

తల్లికి వందనం పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు ప్రకటించారు. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. తల్లికి వందనం పథకం, యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ.. యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారని, తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాని లోకేష్ వివరించారు. 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించిందని, యూడైస్ లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. యూడైస్లో నమోదైన వారిలో అర్హులందరికీ(84.27%) తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించినట్లు పేర్కొన్నారు.
అందరికీ సాయం
వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే.. కేవలం 42,33,098 మందికి మాత్రమే, అంటే 52శాతం మందికి మాత్రమే సాయం అందించారని లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వం 85శాతం మందికి సాయం అందిస్తుందని, 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారని విమర్శించారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారని, 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని అన్నారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని లోకేష్ పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం
“కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేము ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా మేం అందిస్తున్నాం. గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లోకేష్ చెప్పారు. అటు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని నారా లోకేష్ అన్నారు. “రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల వివరాలు, ఈఎమ్ సీలో పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన భూ విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూ విస్తీర్ణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. వీటి వివరాలు ఇవ్వడం జరిగింది. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కాబట్టే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్ అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తాం” మంత్రి తెలిపారు.
