Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొండపల్లి మైనింగ్ వివాదం నేపథ్యంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ శనివారం నాడు కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా సభ్యులుగా ఉన్నారు. ఇది గమనించిన పోలీసులు.. ఇవాళే ఆనందబాబు ఇంటికి పోలీసులు వచ్చారు. వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లేందుకు బయలుదేరిన ఆనంద బాబును అడ్డగించారు. దీంతో పోలీసుల వ్యవహార శైలిపై టీడీపీ నేత నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా వీది రౌడీ నా అంటూ పోలీసులపై నిప్పులు చెరిగారు. తన ఇంటికి వచ్చి తలుపులు వేసే హక్కు మీకెవరు ఇచ్చారంటూ మండిపడ్డారు. తనకు అడ్డుతప్పుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
కృష్ణా జిల్లా మైలవరం నియోజక వర్గంలోని కొండపల్లిలో రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ వివాదం మరింత ముదిరి.. రాజకీయంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ఈ అంశంలోనే ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ను పరిశీలించి వస్తుండగా.. జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రచ్చ నడుస్తుండగానే.. కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సిద్ధమైంది. శనివారం నాడు ఈ కమిటీ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇప్పటికే వివాదం ముదరుతుండటంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుడైన నక్కా ఆనందబాబును హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also read:
Dengue Cases: కరోనా బాధితుల్లో కొత్త గుబులు.. వానాకాలంలో వణికిస్తున్న సీజనల్ వ్యాధులు..
Tokyo Olympics 2021 Highlights: 2-1 ఆధిక్యంలో భారత్ హాకీ జట్టు.. సెమీస్ లో ఓడిన నోవాక్ జకోవిచ్