Andhra Pradesh: ఏపీ రైతులకు షాకింగ్ న్యూస్.. ప్రభుత్వం కొత్త రూల్.. 9వ తేదీ తర్వాత ఈకేవైసీ బంద్
ఏపీలోని రైతులకు ఈకేవైసీ రూల్ అడ్డంకిగా మారింది. ప్రతీ నెల 9వ తేదీ వరకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేందుకు 10వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేయడం లేదు. దీంతో ఈ నిబంధన ఎత్తివేయాలని రైతులు కోరుతున్నారు.

ఏపీలోని రైతులు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈకేవైసీ నిబంధన రైతులకు పెద్ద సమస్యగా మారింది. ప్రతీ నెల 9వ తేదీ వరకు మాత్రమే ఈకేవైసీ చేయించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత వచ్చే రైతులుకు ఎంతో ఒక కారణం చెప్పి అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. తక్కువ సమయం కేవైసీ చేయించుకునేందుకు అవకాశం కల్పించడం వల్ల రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీని వల్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందటం ఆలస్యమవుతోంది. బ్యాంకు రుణాలు, ఇతరత్రా రుణాలు పొందేందుకు పట్టాదారు పుస్తకాలు అవసరమవుతాయి. వీటి జారీలో జరిగే జాప్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేసి ఎప్పుడైనా కేవైసీ చేయించుకునే సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
9వ తేదీ తర్వాత బంద్
రాష్ట్ర ప్రభుత్వం 4,783 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి రైతులకు కొత్త పాసు పుస్తకాలు అందిస్తోంది. పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లిన వారికి సరి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక వీఆర్వోలు ప్రింటింగ్కు పంపే ముందే పాస్ పుస్తకాల కాపీలు అందించి రైతులు చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత కేవైసీ పూర్తి చేస్తున్నారు. వచ్చే నెలలో పంపిణీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు ప్రతీ నెలా 9వ తేదీ వరకు ఈకేవైసీ పూర్తి చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఆ తర్వాత వస్తే కేవైసీ చేయడం లేదు. యాప్ ప్రాబ్లం ఉందనే కారణంతో అధికారులు తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో తాము పాసు పుస్తకాలు పొందటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎప్పుడైనా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
గత నెల నుంచి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ
కాగా ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్రంలోని రైతులందరికీ పంపిణీ చేస్తోంది. ఉచితంగా వీటికి రైతుల ఇంటి వద్దనే అందిస్తోంది. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త వాటిని రైతులందరికీ అందిస్తోంది. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే చేపట్టి జగన్ ఫొటోతో పాసు పుస్తకాలు పంపిణీ చేసింది. దీంతో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రాజముద్రతో పుస్తకాలు అందిస్తామంటూ ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం కొత్త వాటిని పంపిణీ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అందరికీ ఇవి అందాయని చెప్పవచ్చు.
