
ఏపీలో అభివృద్ధి నినాదం ముందు వైసీపీ సంక్షేమ మంత్రం పనిచేయలేదు. అప్పులు తీసుకొచ్చి మరీ వెల్ఫెర్ స్కీంలకు జగన్ బటన్ నొక్కితే.. ఓట్లను మాత్రం రాబట్టలేకపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమంపైనే ఫోకస్ పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్.. ఈసారి నవరత్నాలు ప్లస్ పేరుతో జనాల్లోకి వెళ్లారు. సంక్షేమం పథకాలు అందిస్తే చాలు ప్రజలు తన వెంట నడుస్తారని బాగా నమ్మారు. డీబీటీల ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలో డైరెక్టుగా డబ్బులు పడేలా పథకాలను తీసుకొచ్చారు.
నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి లబ్ది చేకూర్చేలా పర్ఫెక్ట్ ప్లాన్ అమలు చేశారు. సామాజిక పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతు భరోసా, అమ్మఒడి, ఫీజు రియింబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాల ద్వారా డైరెక్టుగా బెనిఫియరీస్ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంట్లో ఒక లబ్ధిదారుడు ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చారు జగన్. నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలు వైసీపీ వైపే ఉంటాయనుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా.. సంక్షేమ మంత్రమే జపించారు. కానీ సీన్ కట్ చేస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు ఊహించని షాకిచ్చాయి.
175 కాకపోయిన సెంచరీతో సరిపెడతారని అనుకున్న వైసీపీ నేతలకు ఓటర్లు భారీ ఝలక్ ఇచ్చారనే చెప్పొచ్చు. సంక్షేమాన్ని నమ్ముకున్న సీఎం జగన్.. మరోవైపు అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. గతుకుల రోడ్లతో సహా గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. రోడ్ల ఎఫెక్ట్ గ్రామాల నుంచి పట్టణాల వరకు పాకింది. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వాలంటీర్లు ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి జగన్ ఓటమికి కారణాలుగా మారాయి.
పంచాయతీలకు నిధుల విషయంలో నిర్లక్ష్యం చేశారని ఏకంగా వైసీపీ సర్పంచ్లో ఆరోపించారు. సంక్షేమం పథకాలు అమలు చేసినా.. కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేశాయి. ఎన్నికలకు ముందు విశాఖలో పెట్టబడుల సదస్సు నిర్వహించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మూడు రాజధానుల అభిప్రాయం కూడా వైసీపీ కొంపముంచాయనే చెప్పొచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..