పొదుపు మంత్రం పాటించాలి.. దుబారా ఖర్చులు వద్దు.. ప్రతి రూపాయి ఇంపార్టెంట్.. ఇటు సంక్షేమాన్ని.. అటు అభివృద్ధిని సమపాళ్లలో ప్రజలకు అందించాలి. అందుకే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకువెళ్లడం కత్తి మీద సాము. అయితే సీఎంగా సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. తన ఎక్స్పీరియన్స్ ఉపయోగించి.. స్మూత్గా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా దుబారాపై దృష్టి సారించింది ప్రభుత్వం. పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది. ప్రభుత్వం మారగానే చాలామంది అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు.
చైర్లు, సోఫాలు, కంప్యూటర్ టేబుళ్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఈ క్రమంలో ఖర్చు దండగ అని భావించిన ప్రభుత్వం.. ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలును నిషేధించింది. 2026, మే 31 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని.. అన్ని శాఖల అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం, కలెక్టరేట్లు, హెచ్ఓడీ ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలు చేయొద్దన్నది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో సారాంశం. అయితే ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, రాజ్భవన్, హైకోర్ట్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. కొత్త ప్రభుత్వానికి ఏడాది రెండేళ్ల వరకు ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవని తెలుస్తోంది. సంపద సృష్టి అన్నది ఓవర్ నైట్లో సాధ్యమయ్యే పని కాదు. వాటి ఫలితాలు రావడానికి వేచి చూడాల్సిన పరిస్థితి. దీంతో ఆర్థికంగా ముందుకెళ్లడం అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఫర్నిచర్ కొనుగోళ్లపైన మాత్రమే నిషేధం విధించారు. ముందు ముందు పొదుపు మంత్రంలో ఇంకెన్ని చేరుస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..