Lakshmi Narasimha Temple: మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పెద కోనేరులో పూడిక తీత పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 152 అడుగుల వరకూ పూడకతీత కొనసాగింది. అధికారుల సమక్షంలో గత ఆరు నెలలుగా పూడికతీత పనులు చేస్తున్నారు. అయితే, పూడిక తీసే సమయంలో విలువైన వస్తువులు బయటపడ్డాయి. పురాతన కాలం నాటి రాగి, బంగారు చెంబులు, గ్లాసులు, కొన్ని చిన్న చిన్న దేవుడి ప్రతిమలు, నాణాలు బయట పడ్డాయి. వీటిల్లో జర్మనీలో తయారు చేసిన రెండు గ్లాసులున్నాయి. వాటిని తిరిగి దేవాలయ అధికారులకు అప్పగించారు.
పెద కోనేరు అద్భుతమైన నిర్మాణం. ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు భావిస్తున్నారు. పైనుండి శ్రీ చక్రం ఆకారంలోనూ, కింద శంఖం ఆకారంలోనూ కోనేరు ఉంది. ఇకపోతే కోనేరు పూడిక తీత పనుల్లో ఆంజనేయస్వామి ఆలయం బయటపడింది. ఆ తర్వాత మెట్లపై చెక్కిన రెండు శివ లింగాలు, గణేషుడి విగ్రహం, మరొక హనుమంతుడు విగ్రహం కూడా బయటపడ్డాయి. ఇంకా అద్భుతం ఏంటంటే.. కోనేరులో ఒక సొరంగ మార్గం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కోనేరు క్రమంగా కుంచించుకుపోతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. ఈ పురాతన కోనేరును పరిరక్షించేందుకు పూడికతీత పనులు చేపట్టారు.
మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిపుణుల కమిటీ సూచించిన మేర అభివృద్ధి పనులు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు. కోనేరును పూర్తిగా అభివృద్ధి చేసిన తరువాత భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఎమ్మెల్యే. గతంలో మంగళగిరి పెద కోనేరులో లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేవారు. అదే విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు కూడా స్నానమాచరించేవారు. ప్రస్తుతం పూడిక తీత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కోనేరును పూర్తిగా అభివృద్ది చేసిన తర్వాతే ఇక్కడే తెప్పొత్సవం నిర్వహిస్తామన్నారు. మరో రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసి కోనేరును అందుబాటులోకి తెస్తామన్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువుదీరిన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.. భారతేదశంలోని శ్రీమహా విష్ణువుకు సంబంధించిన 8 పవిత్ర స్థలాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. అష్ట మహాక్షేత్రాల నరసింహాలలో ఒకటిగా పేర్కొంటారు. ఈ క్షేత్రంలో కొండపైన, దిగువన మూడు దేవాలయాలు ఉన్నాయి. భారతదేశంలోనే ఎత్తైన గోపురం కలిగిన దేవాలయాల్లో మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయ గోపురం ఎత్తు సుమారు 153 అడుగుల ఎత్తుతో 11 అంతస్తులతో నిర్మించారు. ఇక ఈ గోపురం వెడల్పు 49 అడుగులు. ఈ ఆలయాన్ని యుధిష్టిరుడు స్థాపించినట్లు చరిత్ర చెబుతోంది. బ్రహ్మ వైవర్త పురాణంలోనూ ఈ ఆలయానికి సంబంధించి ప్రస్తావన ఉంది. తదనంతర కాలంలో ఈ దేవాలయ నిర్వహణను విజయనగర పాలకులు చూసినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఇందుకు చిహ్నంగా ఆనాటి శాసనం కూడా ఉంది.
Ancient Coins
Mla Alla Ramakrishna Reddy
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..