
అనకాపల్లి జిల్లా చోడవరంలో గంజాయి తరలిస్తూ బీభత్సం సృష్టించిన కారు కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. కారులో నుంచి 240 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రాజస్థాన్కు చెందిన స్మగ్లర్లుగా గుర్తించారు పోలీసులు. ఇంత భారీ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. నిందితులను విచారించి ఈ దందా వెనుక ఎవరున్నారో ఆరా తీస్తున్నారు.
చోడవరంలో గంజాయి తరలిస్తున్న కారు శుక్రవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. కారులో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో చోడవరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కారులో ఉన్న ఇద్దరు నిందుతులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు ఛేజింగ్ చేశారు. పోలీసులు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సమయంలో అతివేగంగా కారును నడుపుతూ బీభత్సానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చోడవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రారంభమైన ఛేజింగ్ కొత్తూరు జంక్షన్ వరకు సాగింది.
ఈ సమయంలో కారును హైస్పీడ్లో నడుపుతూ స్మగ్లరు బైక్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో దుడ్డిపాలెం గ్రామానికి చెందిన కురందాసు గోవింద్, ఆయన భార్య చిన్నమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి వారిని అత్యవసరంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతివేగంలో కారు అదుపుతప్పి కొత్తూరు జంక్షన్లోని హోండా షోరూమ్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్తో పాటు పారిపోవడానికి ప్రయత్నించిన మరోకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..