విశాఖ గ్యాస్లీక్ దుర్ఘటన: మృతుల కుటుంబాలకు చంద్రబాబు ఆర్థిక సాయం
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు..
విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సహా పార్టీ నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన వారికి తెలుగు దేశం పార్టీ తరపున నివాళులర్పించారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు. కానీ, లాక్డౌన్ కారణంగా విశాఖ వెళ్లలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన వెంటనే విశాఖ వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరానని చెప్పారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రానందునే వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ క్రమంలోనే..విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇదిలా ఉంటే, విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. విషవాయువు దెబ్బకు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కి చేరింది. ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన పాల వెంకాయమ్మ ప్రమాదం జరిగిన తర్వాత కేజీహెచ్లో చికిత్స పొంది.. ఈ నెల 13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందిపడుతూ.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 19న మళ్లీ విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ మంగళవారం చనిపోయింది.