
Trump Warning to Iranian: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి నిప్పులు చెరిగారు. ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డుకునేలా అమెరికా సైన్యం ‘నాకాబందీ’ (దిగ్బంధం) ప్రారంభించిన వేళ, ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నావికాదళం ఇప్పటికే సముద్ర గర్భంలో కలిసిపోయిందని, వారి నౌకాబలం పూర్తిగా నాశనమైందని ట్రంప్ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఇరాన్కు చెందిన 158 నౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నౌకలను నాశనం చేశామని వెల్లడించారు. “ఒకవేళ ఇరాన్ వేగవంతమైన దాడి నౌకలు మా దిగ్బంధం దగ్గరికి వస్తే, వాటిని క్షణాల్లో తుత్తునియలు చేస్తాం. మా చర్య చాలా వేగంగా, అత్యంత కఠినంగా ఉంటుంది” అని ట్రంప్ హెచ్చరించారు.
అసలు లక్ష్యం ఏంటి?:
ఇరాన్ చమురు విక్రయాలను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నాకాబందీ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) నివేదిక ప్రకారం.. ఇరాన్ తీర ప్రాంతాలకు వెళ్లే అన్ని దేశాల నౌకలను నిలిపివేసి తనిఖీ చేయనున్నారు. అయితే, ఇతర దేశాల సాధారణ రవాణాకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని సెంటకామ్ వివరించింది.
ఇరాన్ ప్రతిస్పందన:
ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. తమ నౌకలను అడ్డుకుంటే, గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాల ఓడరేవులపై దాడులు చేస్తామని తేహ్రాన్ హెచ్చరించింది.
చిన్న నౌకలతో ముప్పు?:
అమెరికా వాదన ప్రకారం.. ఇరాన్ పెద్ద నౌకలు ధ్వంసమైనప్పటికీ, ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్’ (IRGC) వద్ద ఉన్న చిన్న, వేగవంతమైన నౌకలు ఇప్పటికీ ముప్పుగా ఉన్నాయి. ఇవి సముద్రంలో మైన్స్ (బాంబులు) వేయడంలో, క్షిపణులు ప్రయోగించడంలో ఆరితేరినవి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.