
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా భారత్తో సంబంధాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వంటి దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికా వాణిజ్య స్వాతంత్ర్యం పొందాలంటే.. భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, చిలీ లాంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో తెలిపింది. ఇదిలా ఉండగా.. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఆయన నాలుగు అంశాలతో ప్రణాళికను రూపొందించినట్లు చెప్పింది. అంతేకాదు.. అమెరికా ఫార్మా రంగం చైనాపై ఆధార పడటం తగ్గించకోవడం కోసం ఇండియా, ఇజ్రాయెల్తో తమ సంబంధాలను మరింత విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కంప్యూటర్ చిప్స్ను తయారు చేసేందుకు వినియోగించే లిథియం లాంటి ఖనిజాలను దిగుమతి చేయడం కోసం చైనాకు బదులుగా భారత్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలను ఆశ్రయించడం మంచిదంటూ సూచనలు చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను తయారు చేయడానికి వినియోగించే ఖనిజాల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా అందించే సబ్సిడీల వల్ల పరోక్షంగా చైనాకు లబ్ధి వస్తోందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. అయితే దీనికి బదులుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి అవసరమైనటువంటి మినరల్స్ను భారత్, బ్రెజిల్, చిలీ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని సూచనలు చేశారు. అయితే చిప్స్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి జపాన్, దక్షిణ కొరియా లాంచి దేశాల వల్ల వాణిజ్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని తెలిపారు వివేక్ రామస్వామి.
ఇదిలా ఉండగా.. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో వివేక్ రామస్వామి ప్రస్తుతం వేగంగా దూసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల నిర్వహించినటువంటి జీవోపీ పోల్స్లో ఆయన మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకిపోయారు. దీంతో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్నటువంటి ఈ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 39 శాతం మంది మద్దతుతో మొదటి స్థానంలో ఉన్నారు. అయితే 13 శాతం మంది మద్దతులో వివేక్ రామస్వామి రెండో స్థానంలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.