
ప్రజాస్వామ్యంలో అధికారం గెలిచేది బ్యాలెట్తోనే. కానీ ఆ బ్యాలెట్ ఎలా పడాలి అన్నదానిపై పోరు మొదలైతే. అసలు ప్రజాస్వామ్య పరీక్ష అప్పుడే మొదలవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ డెమొక్రాట్లు. ఇది మనకు ఇప్పటికే తెలిసిన పొలిటికల్ ఫైట్. కానీ ఇప్పుడు అమెరికాలో మరో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. అది ట్రంప్ వర్సెస్ ఓటు!.. అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మెయిల్ బ్యాలెట్లపై వివాదం ముదురుతోంది. పోస్టు ద్వారా ఓటు వేసే విధానాన్ని కట్టడి చేయాలని ట్రంప్ తీసుకున్న చర్యలు వివాదస్పదమయ్యాయి. వాటిని రాష్ట్రాలు, డెమొక్రాట్లు కోర్టుల్లో సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా నిర్ణయాలు.. ఇవన్నీ కలిసి అమెరికా ఎన్నికల వ్యవస్థలో అసలు అధికారం ఎవరిది? అనే ప్రశ్నను తెరపైకి తెచ్చాయి.
ట్రంప్ పరిపాలన మెయిల్-ఇన్ బ్యాలెట్ల విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చూస్తోంది. ఓటర్ అర్హతను మరింత కచ్చితంగా పరిశీలించడం, మెయిల్ బ్యాలెట్ల విషయంలో ఫెడరల్ స్థాయిలో నియంత్రణ పెంచడం, ఎన్నికల్లో అక్రమాలకు అవకాశం లేకుండా చూడటం తమ ఉద్దేశమని ట్రంప్ వర్గం చెబుతోంది.
ట్రంప్ వాదన ప్రకారం ఎన్నికలు సురక్షితంగా ఉండాలి. అర్హత ఉన్నవాళ్లే ఓటు వేయాలి. కానీ ప్రత్యర్థులు మాత్రం ఇదే చర్యలను మరో కోణంలో చూస్తున్నారు. ఎన్నికల భద్రత పేరుతో ఓటు వేసే అవకాశాలనే తగ్గిస్తే ఎలా అనేది ప్రత్యర్థుల వాదన. ఇక్కడే అమెరికాలో అసలు రాజకీయ, రాజ్యాంగ పోరు మొదలైంది.
అమెరికాలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత పూర్తిగా వైట్హౌస్ చేతుల్లో ఉండదు. రాష్ట్రాలకు ఎన్నికల నిర్వహణలో విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఓటర్ రిజిస్ట్రేషన్, బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అనేక అంశాల్లో రాష్ట్రాల పాత్ర కీలకం. అదే సమయంలో ఫెడరల్ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్, దేశవ్యాప్తంగా వర్తించే కొన్ని ఎన్నికల ప్రమాణాలను చట్టాల ద్వారా నిర్ణయిస్తోంది.
అధ్యక్షుడి executive power ఎంతవరకు వెళ్తుంది? ఇదే ఇప్పుడు కోర్టుల ముందున్న అసలు రాజ్యాంగ ప్రశ్న.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఈ వివాదంలో ఆగస్టు 24న అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ట్రంప్ పరిపాలనకు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ట్రంప్ ఆదేశం రాజ్యాంగబద్ధమే అని తుది తీర్పు ఇవ్వలేదు.
కేసును సవాలు చేసిన రాష్ట్రాలకు ఆ దశలో చట్టపరమైన standing ఉందా అనే అంశం సహా న్యాయపరమైన ప్రశ్నలపై కోర్టు నిర్ణయం తీసుకుంది. ఒక దిగువ కోర్టు విధించిన injunctionను తొలగించింది. అయితే మరో న్యాయపరమైన అడ్డంకి కారణంగా ట్రంప్ ఆదేశంలోని కీలక అంశాలపై పోరాటం ఇంకా పూర్తికాలేదు. అంటే..ట్రంప్కు ఇది కోర్టులో ఓ అడుగు ముందుకు.. కానీ ఫైనల్ విక్టరీ మాత్రం కాదు.
కాలిఫోర్నియా సహా పలు రాష్ట్రాలు ట్రంప్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేశాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్రాల రాజ్యాంగ అధికారాన్ని అధ్యక్షుడి executive order ద్వారా మార్చలేరు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నది.. ఆ రాష్ట్ర చట్టాలు, ఎన్నికల అధికారులు నిర్ణయించాల్సిన విషయం. దాన్ని వైట్హౌస్ నుంచి ఒక ఆదేశంతో మార్చడం సరికాదన్నది వారి అభ్యంతరం. అదే సమయంలో మరో ఆందోళన కూడా ఉంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నిబంధనలు మారితే ఓటర్లకే కాదు. ఎన్నికల అధికారులకు కూడా గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అమెరికాలో పోస్టల్ బ్యాలెట్ అనేది సాధారణమైన ఓటింగ్ పద్ధతుల్లో ఒకటి. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వాళ్లు, వృద్ధులు, సైనికులు, విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఇతర కారణాలతో ముందుగానే ఓటు వేయాలనుకునే వారు మెయిల్ బ్యాలెట్ను ఉపయోగిస్తారు. కాబట్టి మెయిల్ ఓటింగ్ నిబంధనలు కఠినంగా మారితే దాని ప్రభావం నేరుగా ఓటర్లపై పడే అవకాశం ఉంది.ఇక్కడ మరో రాజకీయ కోణం కూడా ఉంది. ఎవరెక్కువగా మెయిల్ బ్యాలెట్ వాడుతున్నారు? ఏ రాష్ట్రాల్లో వాడకం ఎక్కువ? ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై దీని ప్రభావం ఎంత అనేది కీలకంగా మారింది. ఇవే ఇప్పుడు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య రాజకీయ లెక్కల్లో కీలకమైన ప్రశ్నలు.
అమెరికాలో 18 ఏళ్లు దాటిన వారంతా ఓటర్లు కాదు. అమెరికా పౌరులైన 18 ఏళ్లు పైబడిన వారినే ఓటు వేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. 2022 మిడ్టర్మ్ ఎన్నికల సమయంలో దేశంలో దాదాపు 23.35 కోట్ల మంది పౌర ఓటింగ్ వయసు జనాభా ఉంది. వీరిలో సుమారు 16.14 కోట్ల మంది ఓటర్లుగా రిజిస్టర్ అయ్యారు.
అయితే రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరూ ఓటు వేయరు. 2022 మిడ్టర్మ్ ఎన్నికల్లో 12.19 కోట్ల మంది ఓటేశారు. అంటే అర్హత ఉన్న పౌరుల్లో 52.2 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిజిస్టర్ అయినవారిని లెక్కలోకి తీసుకుంటే పోలింగ్ శాతం సుమారు 75.5 శాతం నమోదైంది. ఇది అమెరికా మిడ్టర్మ్ ఎన్నికల్లో కూడా భారీ సంఖ్యే. 2018లో అర్హత ఉన్న పౌరుల్లో 53.4 శాతం ఓటేయగా, 2022లో అది 52.2 శాతానికి తగ్గింది.
అంటే సింపుల్గా చెప్పాలంటే.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మిడ్టర్మ్లో ఓటర్ల ఆసక్తి తక్కువ. కానీ కాంగ్రెస్ నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలన్నది తేల్చేది ఈ ఓట్లే. అందుకే 2026 మిడ్టర్మ్ ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్లపై జరుగుతున్న పోరు మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం దాదాపు మూడో వంతు మంది ఓటర్లు మెయిల్ ద్వారా ఓటేస్తున్నారని ఎన్నికల పరిశోధనా సంస్థల డేటా చెబుతోంది.
అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలు అంటే అధ్యక్షుడి ఎన్నిక కాదు. కానీ కాంగ్రెస్లో ఎవరి చేతిలో మెజారిటీ ఉంటుంది అన్నది తేల్చే ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికలు ట్రంప్ పాలనకు కూడా ఒక రాజకీయ రిఫరెండంలా మారే అవకాశం ఉంది. మెయిల్ ఓటింగ్పై నిబంధనలు మారితే ఎన్నికల భద్రత పెరుగుతుందని రిపబ్లికన్లు చెబుతున్నారు. ఓటు హక్కును పరిమితం చేసే ప్రయత్నమని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.
మెయిల్ ఓటింగ్ నిబంధనలు మారగానే ఖచ్చితంగా ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం వస్తుందో ఇప్పుడే చెప్పలేం. దాని ప్రభావం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. ఏ వర్గం ఎక్కువగా మెయిల్ ఓటింగ్పై ఆధారపడుతోంది? కొత్త నిబంధనలు ఎలా అమలవుతాయి? ఎన్ని బ్యాలెట్లు తిరస్కరిస్తారు? కోర్టులు చివరికి ఏం చెబుతాయి? అనే అంశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది.
అమెరికా ఎన్నికల విషయంలో ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య అధికార పోరు కొత్త విషయం కాదు. ఓటర్ అర్హత, ఎన్నికల నిబంధనలు, బ్యాలెట్ యాక్సెస్, ఓటింగ్ విధానం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిపై గతంలోనూ కోర్టు కేసులు, రాజకీయ వివాదాలు జరిగాయి. అధ్యక్షుడి executive power ఉపయోగించి దేశవ్యాప్తంగా మెయిల్ బ్యాలెట్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న ప్రయత్నం రాజ్యాంగ పరిమితులపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అందుకే ఈ కేసు ఒక్క ట్రంప్ పాలనకే సంబంధించినది కాదు.భవిష్యత్తులో అమెరికా అధ్యక్షులు ఎన్నికల వ్యవస్థపై ఎంతవరకు జోక్యం చేసుకోగలరన్న దానికి కూడా ఇది ఒక ఉదాహరణగా మారవచ్చు.
విపక్షాల వాదన
ఎన్నికల భద్రత పేరుతో ఓటు హక్కును కుదించొద్దని డెమొక్రాట్ల ప్రధాన ఆరోపణగా ఉంది. మెయిల్ ఓటింగ్ అనేది చట్టబద్ధమైన ఓటింగ్ విధానం. దాన్ని ఒక్కసారిగా కఠినతరం చేస్తే నిజమైన ఓటర్లకు ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు దగ్గరగా నిబంధనలు మార్చడం వల్ల ఓటర్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు.
ఓటు హక్కు ఎంత ముఖ్యమో.. ఆ ఓటు నిజమైనదే అని నిర్ధారించడం కూడా అంతే ముఖ్యమనేది రిపబ్లికన్ల వాదనగా ఉంది. అందుకే మెయిల్ బ్యాలెట్ల విషయంలో మరింత కఠినమైన verification అవసరమని చెబుతున్నారు.
ఈ వివాదానికి పరిష్కారం ఒక పార్టీ గెలవడం కాదు. ఎన్నికల వ్యవస్థపై అమెరికన్లకు నమ్మకం కలిగేలా స్పష్టమైన నియమాలు ఉండటం. అందుకోసం..ఎన్నికలకు కొద్దికాలం ముందు నిబంధనలు మార్చకుండా ముందుగానే స్పష్టమైన చట్టాలు రూపొందించాలి. ఓటర్ అర్హతను కచ్చితంగా నిర్ధారించే వ్యవస్థ ఉండాలి. మెయిల్ బ్యాలెట్ల భద్రతను పెంచాలి. అర్హత ఉన్న ఓటర్ల బ్యాలెట్లను కేవలం చిన్న సాంకేతిక కారణాలతో తిరస్కరించే పరిస్థితులు తగ్గించాలి.అన్నింటికంటే ముఖ్యంగా..రాష్ట్రాల అధికారాలు ఎంత? ఫెడరల్ ప్రభుత్వ అధికారాలు ఎంత? అధ్యక్షుడి అధికార పరిమితి ఎంత? ఇవి చట్టపరంగా స్పష్టంగా ఉండాలి.
ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఓటింగ్ విధానం మారడంలోనే ఉండదు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోవడమే అసలైన ప్రమాదం. గెలిచిన పార్టీ ఎన్నికలు న్యాయంగా జరిగాయని చెబుతాయి. ఓడిపోయిన పార్టీ మాత్రం ఎన్నికల వ్యవస్థనే ప్రశ్నిస్తాయి. దీంతో ప్రజల్లో అనుమానం మొదలవుతుంది. అదే ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్య. అందుకే 2026 అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పోరును కేవలం ట్రంప్ వర్సెస్ డెమొక్రాట్లుగా చూడటం సరిపోదు. ఇది..అధ్యక్షుడి అధికారం వర్సెస్ రాష్ట్రాల అధికారం అని చెప్పవచ్చు. ఎన్నికల భద్రత వర్సెస్ ఓటు హక్కు. బ్యాలెట్పై ఎవరి నియంత్రణ ఉండాలనేది అసలు ప్రశ్న.
బ్యాలెట్ ఎవరి చేతిలో ఉందో.. భవిష్యత్తు కూడా చివరికి వారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే అమెరికాలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం మెయిల్ బ్యాలెట్పై న్యాయపోరు కాదు. ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద పరీక్ష అని పలువురు పేర్కొంటున్నారు.
మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..