AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులకు పెరిగిన ముప్పు.. వైరల్‌గా వీడియో!

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో భారతీయ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారతీయ సిబ్బందితో ఉన్న నౌకపై ఇరాన్‌కు చెందిన పడవలు కాల్పులు జరిపిన ఏప్రిల్ నాటి వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ మార్గంలో భారతీయ నావికుల భద్రత కోసం కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులకు పెరిగిన ముప్పు.. వైరల్‌గా వీడియో!
Strait Of Hormuz
Rajashekher G
|

Updated on: Aug 21, 2026 | 9:12 AM

Share

Indian Sailors: ప్రపంచవ్యాప్తంగా సముద్ర రవాణా రంగంలో భారతీయ నావికుల పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలోని మొత్తం సముద్ర నావికుల్లో దాదాపు 12.2 శాతం మంది భారతీయులే. అయితే ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో చోటుచేసుకుంటున్న దాడులు భారతీయ నావికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణాలో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి మీదుగానే సాగుతుంది. ఈ కీలక సముద్ర మార్గం యుద్ధ వాతావరణంలో చిక్కుకోవడంతో వాణిజ్య నౌకలపై ప్రమాదం గణనీయంగా పెరిగింది.

భారతీయ నావికులపై దాడుల ప్రభావం

ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడులు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. జూన్‌లో ప్రచురితమైన ఆ నివేదిక ప్రకారం కనీసం 15 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో భారత నావికులు ఎదుర్కొన్న ప్రమాద తీవ్రతను చూపించే ఏప్రిల్ నాటి ఓ పాత వీడియోను ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

భారతీయ సిబ్బందితో ఉన్న నౌకపై కాల్పులు

ఏప్రిల్ 22న చోటుచేసుకున్న ఈ ఘటనలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ నౌకను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందినవిగా గుర్తించిన పడవలు చుట్టుముట్టాయి. ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో నౌకపై కాల్పులు కూడా జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒక దశలో రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) ప్రయోగించిన దృశ్యం కూడా వీడియోలో నమోదైంది. దీంతో నౌకలో ఉన్న నావికులు ప్రాణభయంతో లోపలికి వెళ్లి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఈ నౌకలో మొత్తం 21 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అయితే అదృష్టవశాత్తూ వారంతా క్షేమంగా ఉన్నట్లు భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అనంతరం వెల్లడించింది.

నావికుల భద్రతపై కేంద్రం కీలక ఆదేశాలు

హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భారతీయ నావికుల భద్రతకు సంబంధించి నౌక యజమానులు, షిప్ మేనేజర్లు, రిక్రూట్‌మెంట్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, పరిసర జలాల్లో ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను మోహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ప్రమాదకర మార్గాల్లో భారతీయ నావికులను పంపకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశం

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) ప్రకారం, ఇటీవల నౌకలపై జరిగిన దాడులతో సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులు ఎదుర్కొంటున్న ప్రమాదం గణనీయంగా పెరిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారతీయ నావికుల ప్రయోజనాలను కాపాడేందుకు మరింత అప్రమత్తమైన భద్రతా చర్యలు అవసరమని DGS పేర్కొంది.

అంతేకాకుండా నౌకల కెప్టెన్లు పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, పరిసర సముద్ర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. నావిగేషన్‌కు సంబంధించిన హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణ మార్గాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దేశాలకే కాకుండా వేలాది మంది సముద్ర నావికుల భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ సముద్ర కార్మికుల్లో గణనీయమైన వాటా కలిగిన భారతీయ నావికుల రక్షణ ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది.

Follow Us