Russia-Ukraine War: ఉక్రెయిన్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా.. ముగ్గురు చిన్నారుల సహా 13 మంది మృతి!
ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. శుక్రవారం డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్పై దాడులకు దిగింది. రష్యా దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 13 మంది మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలైన కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీల్లో చాలా భవనాలు దెబ్బతిన్నాయి. అయితే రెండు దేశాల మధ్య యుద్ధంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా ఉక్రెయిన్ చెబుతోంది.

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న తరుణంలో మరోసారి రష్యా ఉక్రెయిన్పై దాడులకు పాల్పడింది. రాత్రిపూట జరిగిన విధ్వంసకర దాడిలో, రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఇది ఇప్పటివరకు యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడిగా ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఈ దాడిలో జైటోమిర్లో ముగ్గురు పిల్లలు సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా, భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అయితే రష్యన్ దాడులను ఉక్రెయిన్ వైమానిక దళం కొంత మేర అడ్డుకోగలిగింది. సుమారు 266 రష్యన్ డ్రోన్లును, 45 క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక దళాలు కూల్చి వేశాయి. అయినప్పటికీ భారీ మొత్తంతో ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగిపోయింది.
రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా కావాలనే “సాధారణ నగరాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైలెంట్గా ఉండటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని కోరారు. కాల్పుల విరమణ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకురాకపోతే ఈ క్రూరత్వాన్ని ఆపలేము” ఆయన తన ఎక్స్లో వేదికగా పేర్కొన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
