ద్వీప దేశం శ్రీలంకలో(Sri Lanka) సంక్షోభం మరింతగా ముదురుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పుకూలిపోయిందని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(PM Ranil Wickremesinghe) ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలినట్లు ప్రధాని పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. భారీ అప్పుల కారణంగా పెట్రోలియం కార్పొరేషన్ దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉంది. ఫలితంగా ప్రపంచంలోని ఏ దేశం లేదా సంస్థ ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదని స్వయంగా ప్రధానమంత్రే చెప్పడం గమనార్హం.
ఈ సంవత్సరం చెల్లించాల్సిన 7 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని నిలిపి వేస్తున్నట్లు శ్రీలంక ఇప్పటికే ప్రకటించింది. 2026 నాటికి సంవత్సరానికి సగటున 5 డాలర్లు బిలియన్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులు శ్రీలంకలో ఉన్నారు. చెల్లింపు తేదీలను పొడగించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. శ్రీలంకలో కొన్ని నెలలుగా ఆర్థిక, ఆహార, ఇంధన, విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమవ్వడం, ధరలు మండిపోతుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఆర్థిక సంక్షోభం మరింత దిగజారడంతో శ్రీలంక సర్కార్ అనూహ్య చర్యలు చేపట్టింది. చమురు కొరతను దృష్టిలో పెట్టుకొని సాధారణ సేవలకు రెండు వారాల పాటు షట్డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలను నామమాత్రపు సిబ్బందితో నడిపిస్తున్నారు. ఆసుపత్రులు, నౌకాశ్రయాలు మాత్రం అత్యవసర సర్వీసులుగా పరిగణించి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా పెట్రోలు సంక్షోభం మరింత తీవ్రమైంది. బంకుల దగ్గర వాహనాలు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో బారులు తీరి ఎదురు చూస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..