ఫీఫా వరల్డ్ కప్ వేళ తీవ్ర విషాదం.. పాలస్తీనా గోల్ కీపర్ అల్-అష్కర్ దారుణ హత్య!

ప్రపంచవ్యాప్తంగా సాకర్ పండుగ 2026 ఫీఫా ప్రపంచ కప్ జరుగుతున్న తరుణంలో, ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత విషాదకరమైన వార్త వెలువడింది. పాలస్తీనాకు చెందిన 32 ఏళ్ల ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సలీం ఖాదర్ అల్-అష్కర్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కాల్చి చంపాయి. ఖాన్ యూనస్ సర్వీసెస్ క్లబ్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్న అల్-అష్కర్ హత్యను పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PFA) అధికారికంగా ధృవీకరించింది.

ఫీఫా వరల్డ్ కప్ వేళ తీవ్ర విషాదం.. పాలస్తీనా గోల్ కీపర్ అల్-అష్కర్ దారుణ హత్య!
Palestinian Goalkeeper Saleem Al Ashqar

Updated on: Jul 03, 2026 | 12:49 PM

ప్రపంచవ్యాప్తంగా సాకర్ పండుగ 2026 ఫీఫా ప్రపంచ కప్ జరుగుతున్న తరుణంలో, ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే అత్యంత విషాదకరమైన వార్త వెలువడింది. పాలస్తీనాకు చెందిన 32 ఏళ్ల ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సలీం ఖాదర్ అల్-అష్కర్‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) కాల్చి చంపాయి. ఖాన్ యూనస్ సర్వీసెస్ క్లబ్ గోల్ కీపర్‌గా సేవలందిస్తున్న అల్-అష్కర్ హత్యను పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PFA) అధికారికంగా ధృవీకరించింది. ఈ సంఘటన క్రీడా ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను రేకెత్తించింది.

అల్-అష్కర్ మరణం అతని కుటుంబంలో ఎవరూ పూడ్చలేని పెద్ద లోటును మిగిల్చింది. ఏడుగురు సోదరీమణులకు అల్-అష్కర్ ఒక్కడే సోదరుడని పీఎఫ్ఏ తన నివేదికలో వెల్లడించింది. కేవలం ఐదు నెలల క్రితమే అతనికి వివాహం జరగగా, ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. తన మొదటి బిడ్డ ముఖాన్ని కళ్లారా చూడకముందే, ఆ బిడ్డకు తండ్రి ప్రేమను అందించకముందే అతను కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. అతని అకాల మరణం భార్యతో పాటు, సోదరీమణులను తీవ్ర దుఃఖంలో ముంచేసింది.

పాలస్తీనాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సాయుధ సంఘర్షణలు ఆ దేశ సాధారణ ప్రజలనే కాకుండా, క్రీడారంగాన్ని కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఈ ఉద్రిక్తతల కారణంగా పాలస్తీనాలో ఇప్పటివరకు 1,009 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులలో అత్యధికంగా 567 మంది కేవలం ఫుట్‌బాల్ రంగానికి చెందిన ఆటగాళ్లు, కోచ్‌లు, రిఫరీలు ఉండటం గమనార్హం. ఈ ఘోర గణాంకాలు అక్కడ క్రీడలపై పడిన దారుణ ప్రభావానికి అద్దం పడుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫీఫా ప్రపంచ కప్‌కు పాలస్తీనా జాతీయ జట్టు అర్హత సాధించలేకపోయింది. ఆసియా క్వాలిఫైయర్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఆ జట్టు టోర్నమెంట్‌కు దూరమైంది. అయితే, ఈ ఏడాది జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ పలు సరికొత్త రికార్డులకు వేదికైంది. చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లు ఈ మెగా టోర్నీలో తలపడుతున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్న ఈ టోర్నమెంట్‌కు మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఒకే ప్రపంచ కప్‌కు మూడు దేశాలు ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే ప్రథమం. కాగా, 2022లో జరిగిన గత ఫీఫా ప్రపంచ కప్‌కు ఖతార్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us