నేపాల్ వరదల్లో మహిళా ‘పైలట్’ సాహసం.. 100 రెస్క్యూ ఆపరేషన్లు..
వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న రసువా జిల్లాలోని తైమూర్ పట్టణంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రస్తుతం దాదాపు 20 హెలికాప్టర్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ భారీ సహాయక చర్యల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తొలి మహిళా పైలట్ ప్రియా అధికారి ఓ అంతర్జాతీయ వార్తా ఛానెల్తో తన అనుభవాలను పంచుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, దెబ్బతిన్న భౌగోళిక పరిస్థితుల నడుమ ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం సవాలుతో కూడుకుందని అన్నారు.

నేపాల్ను ఇటీవల కుదిపేసిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది వరద నీటిలో కొట్టుకుపోగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణాలకు ముప్పు పొంచివున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె నాయకత్వంలో కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు 100 రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించడం విశేషం.
సాధారణ పర్యావరణ శాస్త్ర విద్యార్థిగా జీవితాన్ని ప్రారంభించిన ప్రియా అధికారి, అనుకోని మలుపు తిరిగిన తన కెరీర్తో నేపాల్ గర్వించదగిన తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎదిగారు. క్యాబిన్ సిబ్బందిగా పనిచేస్తున్న సమయంలో చేసిన ఒక హెలికాప్టర్ విహారయాత్ర ఆమె ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే ఫిలిప్పీన్స్కు వెళ్లి కఠినమైన హెలికాప్టర్ పైలట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. నేపాల్ లో తొలి హెలికాప్టర్ పైలట్ గా గుర్తింపు పొందారు.
2017 నుంచి పూర్తిస్థాయి పైలట్గా బాధ్యతలు చేపట్టిన ఆమె, అత్యంత ప్రమాదకరమైన ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో అపారమైన నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వత ప్రాంతాల్లో గాయపడిన పర్వతారోహకులను రక్షించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఏకంగా సముద్ర మట్టానికి సుమారు 6200 మీటర్ల ఎత్తులో చేపట్టిన క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్లలోనూ ఆమె పాల్గొని తన సత్తా చాటారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రత్యేక శిక్షణ పొందానని, ప్రాణాలను రక్షించడమే తన ప్రధాన కర్తవ్యమని ప్రియ ధైర్యంగా చెబుతుంటారు.
‘‘ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకే ప్రాంతంలో దిగుతున్నాయి. బాధితులను తరలించడానికి రేడియో ద్వారా ఒకరితో ఒకరం సమాచారం పంచుకుంటూ సమన్వయం చేసుకుంటున్నాం. భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా ఉంటుంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులను తరలిస్తున్నాం. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అలర్ట్ గా ఉండాల్సి వస్తుంది. తొలి రెండు రోజుల్లోనే 200 మందిని కాపాడాం. వరదలో ఎన్నో మృతదేహాలు చిక్కుకోవడాన్ని కళ్లారా చూశాం. దాదాసే ఐదు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఎన్నడూ కనీవినీ ఎరుగని విలయం ఇది. ప్రాణనష్టం భారీగా చోటుచేసుకుంది’’ అని ప్రియా అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. వరుస ప్రయాణాల వల్ల పైలట్లు ఎంతగానో అలసిపోయినప్పటికీ, రెస్క్యూ పనులను మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నామని* అంతర్జాతీయ మీడియాతో ప్రియా అధికారి తెలిపారు.