
నేపాల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అవినీతికి పాల్పడ్డారని ఓలీ సర్కార్ను దించేసిన జెన్-Z నేతలు ఇప్పుడు తమలో తాము కొట్టుకుంటున్నారు. అధికారం కోసం తన్నులాడుకుంటున్నారు. ఖాట్మండులో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు వర్గాలుగా విడిపోయిన జెన్ Z నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తాత్కాలిక ప్రధానిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బాలెన్ షా, సుశీలా కర్కి వర్గాలుగా విడిపోయిన నేతలు ఘర్షణకు దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర చర్చలకు వచ్చిన నేతల మధ్య గొడవలు చెలరేగాయి.
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీషింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎవరికి వాళ్లే నేతలుగా ప్రకటించుకోవడంతో నేపాల్లో అంతా గందరగోళంగా మారింది. చాలామంది నేతలు కుల్మాన్ ఘీషింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇరువర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
నేపాల్లో హింస మధ్య, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు అనేది ఇంకా నిర్ణయించనప్పటికీ, కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఒక రోజు క్రితం వరకు, నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కానీ ఇప్పుడు కుల్మాన్ ఘిసింగ్ తాత్కాలిక ప్రధానమంత్రి అవుతారని దాదాపుగా ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుంటే, నేపాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతం అయ్యింది. రెండు ఎయిర్ ఇండియా విమానాలు ఖాట్మండు చేరుకున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయితేనే నేపాల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఇండో నేపాల్ సరిహద్దుల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. నేపాల్ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు భారత్లో ఆశ్రయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు భారత సరిహద్దుల్లో 60 మంది నేపాల్ ఖైదీలను పట్టుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..