Medicine Crisis in Pakistan: పాక్‌ ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు.. కుప్పకూలిన వైద్య వ్యవస్థ

|

Feb 26, 2023 | 9:01 PM

ఆస్పత్రుల్లో మందులు లేవు. ఆపరేషన్లు ఆగిపోయాయి. వైద్యం చేయలేక డాక్టర్లు చేతులెత్తేశారు. రోగులు హాహాకారాలు చేస్తున్నారు. మెడిసిన్స్‌ తయారు చేయలేక ఫార్మా కంపెనీలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఆరోగ్య రంగం కూడా..

Medicine Crisis in Pakistan: పాక్‌ ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు.. కుప్పకూలిన వైద్య వ్యవస్థ
Medicine Crisis In Pakistan
Follow us on

ఆస్పత్రుల్లో మందులు లేవు. ఆపరేషన్లు ఆగిపోయాయి. వైద్యం చేయలేక డాక్టర్లు చేతులెత్తేశారు. రోగులు హాహాకారాలు చేస్తున్నారు. మెడిసిన్స్‌ తయారు చేయలేక ఫార్మా కంపెనీలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఆరోగ్య రంగం కూడా అనారోగ్యం పాలైంది. ప్రభుత్వం చేతులెత్తెయ్యడంతో ఇక ఆస్పత్రులు కూడా మూతపడే పరిస్థితులు వస్తాయనే భయంతో జనం వణికిపోతున్నారు. పాకిస్తాన్‌ ఇప్పుడు పరేషాన్‌ అవుతోంది. ఇదీ పాకిస్తాన్‌ పరిస్థితి. మన ఇరుగులో పురుగులా మారిన దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో అక్కడి పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరిచాయి. ఆర్థిక సంక్షోభం అక్కడి వైద్య వ్యవస్థకు కూడా వైరస్‌లా సోకి అది కుప్పకూలేలా చేస్తోంది. ఆస్పత్రుల్లో అత్యవసర ఔషధాల కొరతతో పాకిస్తాన్‌ పరేషాన్‌ అవుతోంది. ఫారెక్స్‌ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర మందులు దిగుమతి చేసుకోలేక ఆస్పత్రుల్లో రోగులు హాహాకారాలు చేసే పరిస్థితి వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే ఇతర ఔషధాల ముడి సరుకును సైతం దిగుమతి చేసుకోలేక పాకిస్తాన్‌ విలవిలలాడుతోంది. దీంతో స్థానిక ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సల్ని నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థిక అనారోగ్యంతో ఆరోగ్య రంగం మంచాన పడింది.

గుండె, క్యాన్సర్‌, కిడ్నీ సహా కొన్ని సున్నితమైన శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్‌ థియేటర్లలో వినియోగించే అనస్తీషియా నిల్వలు రెండు వారాల కన్నా తక్కువే ఉన్నాయి. తమ దిగుమతుల కోసం బ్యాంకులు కొత్తగా లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను జారీ చేయడంలేదని ఫార్మా కంపెనీలు వాపోతున్నాయి. ఇలాంటి పరిస్థితే తమ ఆరోగ్య రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ప్రభుత్వాన్ని ప్రజలతో పాటు మేధావులు, డాక్టర్లు, ఫార్మా కంపెనీలు నిందిస్తున్నాయి. పాకిస్తాన్‌ తమ దేశంలో ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో దాదాపు 95శాతం భారత్, చైనా లాంటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో డాలర్ల కొరత కారణంగా ఫార్మా కంపెనీలు దిగుమతి చేసుకున్న ముడి సరుకు కరాచీ పోర్టు లోనే నిలిచిపోయింది.

పెరిగిన తయారీ ఖర్చు

ఇక ఉత్పత్తి వ్యయం కూడా పెరగడంతో ఫార్మా కంపెనీలు కూడా కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయి. ఇంధన ధరలు పెరగడం, రవాణా చార్జీలు, పాక్‌ రూపీ విలువ క్షీణించిపోవడంతో మందుల తయారీ ఖర్చు మరింత పెరిగిపోతోందని ఫార్మా కంపెనీలు వాపోతున్నాయి. ఇలా అయితే ఇక షట్టర్‌ క్లోజ్‌ చెయ్యడమే నెక్ట్స్‌ అంటున్నాయి ఆయా వర్గాలు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మహా విపత్తుగా మారక ముందే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి పాక్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. అయితే వెంటనే చర్యలు తీసుకోవడానికి బదులు అధికారులు ఔషధాల కొరతపై సర్వేలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని ఔషధాల కొరత సాధారణమే అయినప్పటికీ.. ముఖ్యమైన ఔషధాలైన పాన్‌డోల్‌, ఇన్సులిన్, బ్రూఫెన్, డిస్ప్రిన్, కాల్పాల్‌, టెగ్రల్, నిమెసులైడ్, హెపామెర్జ్, బస్కోపాన్, రివోట్రిల్ అందుబాటులో లేకపోవడం మాత్రం ఎక్కువమంది వినియోగదారులపై ప్రభావితం చూపుతోందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. పాక్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో ఆస్పత్రులు కూడా మూతపడే పరిస్థితి వస్తుందనే భయంతో అక్కడి ప్రజానీకం వణికిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.