వేడెక్కుతున్న భూమి..ధనిక దేశాలకు పట్టదా? ఐరాస సీరియస్!
మన భూగోళం ఉడికిపోతోంది! రానున్న కొద్ది సంవత్సరాలలో భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) హెచ్చరించింది. పారిస్ ఒప్పందంలో పెట్టుకున్న లక్ష్యం దాటిపోయాం..అయినా సరే.. నిరాశ పడకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించి గాడిలో పెట్టే దిశగా ప్రపంచం కదలాలి. ఇకపై ఉష్ణోగ్రతల పెరుగుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని కోరింది.

మన భూగోళంలో ఊహకందని రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రమాద ఘంటికలు దగ్గరపడ్డాయి. ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే సమయాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు. ఈ వేసవిలో నమోదైన వేడి, ఉక్కపోత, భయానక అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత వేడిగా మారబోతోందో చెప్పే శాంపిల్ అని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అంతం అవుతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
ఒకవేళ భూమి వేడి ఇలాగే పెరిగి 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం మళ్లీ ఎప్పటికీ బాగుచేసుకోలేని పెద్ద నష్టమే వస్తుంది. విపరీతమైన తుపానులు, వర్షాలు, కరువు, తినడానికి తిండి, తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకని కష్టకాలం వస్తుందని గట్టిగా హెచ్చరించారు. మంచు కొండలు కరిగి సముద్ర నీరు పొంగిపొర్లడంతో, సముద్ర తీరాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలు ఇళ్లు కోల్పోయి శరణార్థులుగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అమెజాన్ అడవులు పూర్తిగా దెబ్బతినడం, సముద్రంలోని నీటి ప్రవాహాల తీరు మారడం వంటి పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని ఐరాస నివేదిక హెచ్చరిస్తోంది.
భూమి వేడిని తగ్గించి మళ్లీ సాధారణ స్థితికి తేవాలంటే కేవలం పొగలు, కాలుష్యం తగ్గించడం ఒక్కటే సరిపోదు. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చేసే ఆధునిక సాంకేతికతతో పని చేసే పరికరాలను వాడటంతో పాటు, దేశాల వ్యాప్తంగా విపరీతంగా మొక్కలు నాటి అడవులను కాపాడుకోవడం చాలా ముఖ్యమని గుటెరస్ చెబుతున్నారు. అయితే ఇదే అదనుగా పెద్ద కంపెనీలు, దేశాలు బొగ్గు, పెట్రోల్, గ్యాస్ వాడకాన్ని ఆపకుండా కాలయాపన చేస్తుండటాన్నితీవ్రంగా తప్పుపట్టారు. ముందుగా శిలాజ ఇంధనాల వాడకానికి పూర్తిగా స్వస్తి పలకడమే అసలైన పరిష్కారమని స్పష్టం చేసారు.
ఈ వాతావరణ ముప్పుకు ప్రధాన కారణమైన ధనిక, అభివృద్ధి దేశాలు వెంటనే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ఈ పోరాటంలో ముందుండి నడిపించాలని ఐరాస నివేదిక తేల్చిచెప్పింది. ఇకపై పాత పద్ధతులు అస్సలు పనిచేయవని, ప్రతి దేశం కలిసికట్టుగా ఈ వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు గట్టి ప్రణాళికలు వేసుకోవాలని పిలుపునిచ్చింది. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పరిమితి కోసం చేసే ఈ పోరాటం కేవలం ప్రకృతి కోసం కాదని… ఇది భూమ్మీద మనుషుల మనుగడ సాగించడానికే జరుగుతున్న ఆఖరు పోరాటమని ఐరాస అధినేత ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.