Eliyantha White: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు.. చివరకు కరోనాతో మృతి

| Edited By: Janardhan Veluru

Sep 25, 2021 | 3:33 PM

Eliyantha White:  కరోనా మహమ్మారి ఎందరో బలి తీసుకుంది. తాను కనిపెట్టిన మందే తనను కాపాడలేకపోయింది. కరోనా వైరస్‌కు మందు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు..

Eliyantha White: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు.. చివరకు కరోనాతో మృతి
Eliyantha White
Follow us on

Eliyantha White:  కరోనా మహమ్మారి ఎందరో బలి తీసుకుంది. తాను కనిపెట్టిన మందే తనను కాపాడలేకపోయింది. కరోనా వైరస్‌కు మందు కనిపెట్టానన్న శ్రీలంక తాంత్రికుడు ఎలియంత వైట్(48) మృతి చెందాడు. సెప్టెంబర్ 22న కొలంబోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్-19 చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి ప్రముఖ క్రీడాకారులతో పాటు, రాజపక్స వంటి అగ్రశ్రేణి రాజకీయ నాయకులకు ఎలియంత వైట్ వైద్యం అందించారు. అయితే ఆయన తయారు చేసిన మందులను నదుల్లో కలిపితే అది శ్రీలంకతో పాటు పొరుగునే ఉన్న భారత్‌లో కరోనావైరస్‌ను అంతమొందించగలదని వైట్ గతంలో పేర్కొన్నారు.

48 ఏళ్ల ఎలియంత వైట్ సెప్టెంబర్‌ మొదట్లో కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాక ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. శ్రీలంక మాజీ ఆరోగ్య మంత్రి పవిత్ర వన్నిరాచ్చి కూడా ఆయన ఔషధానికి బహిరంగంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వైరస్ బారిన పడిన ఆమె రెండు వారాల పాటు ఇంటెన్సివ్ కేర్‌లో గడిపారు.

పలువురు క్రికెటర్లకు చికిత్స..

కాగా, పలువురు భారత ప్రముఖ క్రికెటర్లకు చికిత్స అందించిన ఆయన ఇటీవలి కాలంలో చాలా ఆయన ఎంతో ప్రాచుర్యం పొందారు. కానీ వైద్య నిపుణులు, ఆయన చికిత్స విధానాన్ని తిరస్కరించారు. మోకాలి గాయం నుంచి కోలుకోవడంలో ఎలియంత వైట్ తనకు సహాయపడ్డారని, 2010లో సచిన్ టెండూల్కర్ ఆయనకు బహిరంగంగా కృత‌జ్ఞత‌లు తెలిపారు.

శ్రీలంక ప్రధాని కూడా..

ప్రస్తుత శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స కూడా ఎలియంత వైట్ వద్ద చికిత్స పొందారు. ఆయన మృతికి రాజపక్స ట్విటర్‌లో సంతాపం తెలిపారు. ఆయన వారసత్వం ఎప్పటికీ బతికే ఉంటుంది. అనేక వ్యాధులను ఆయన నయం చేశారు అని రాజపక్స ట్వీట్ చేశారు. కాగా, కరోనాతో మృతి చెందిన ఎలియంత వైట్ కోవిడ్‌ నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు.

డెల్టా వేరియంట్ వ్యాప్తి కారణంగా శ్రీలంకలో గత నెల రోజుల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంది. వైరస్ కారణంగా శ్రీలంకలో 12,000 మంది మరణించారని, 5 లక్షలకు పైగా వైరస్ బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. కానీ వైద్యనిపుణులు మాత్రం మరణాల సంఖ్య దానికంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.

ఎలియంత వద్ద చికిత్స తీసుకున్న వారిలో ప్రముఖులు..

శ్రీలంక ఆర్థిక వేత్త హర్ష డిసిల్వా, బాలీవుడ్ నటి బిపాశా బసు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ ఆశిశ్ నెహ్రా
మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇయాన్ చాపెల్, మాజీ శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా తదితరులు ఉన్నారు.

 

ఇవీ కూడా చదవండి:

Covid News: దేశంలో థర్డ్ వేవ్ వస్తుందా..? CSIR నిపుణులు ఏమని తేల్చారో తెలుసా..

India Vaccination: వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో అరుదైన రికార్డు సృష్టించిన భారత్‌.. ఈ నెలలో ఎన్ని డోసులంటే..