చైనాలో అంతుపట్టని ఏనుగుల సుదీర్ఘ పాదయాత్ర

| Edited By: Phani CH

Jun 09, 2021 | 7:39 AM

ఆకలిదప్పులను తీర్చుకోవడం కోసం మనిషి వలసబాట పట్టడం అనాదిగా వస్తోంది..మనిషే కాదు.. సమస్త జీవరాశులు ఇలాగే చేస్తాయి.. ఆహారం, నీరు ఉన్న చోటుకు తరలివెళతాయి..

చైనాలో అంతుపట్టని ఏనుగుల సుదీర్ఘ పాదయాత్ర
Elephants
Follow us on

ఆకలిదప్పులను తీర్చుకోవడం కోసం మనిషి వలసబాట పట్టడం అనాదిగా వస్తోంది..మనిషే కాదు.. సమస్త జీవరాశులు ఇలాగే చేస్తాయి.. ఆహారం, నీరు ఉన్న చోటుకు తరలివెళతాయి.. గుంపులు గుంపులుగా ఓ చోట నుంచి మరో చోటకు వెళుతుంటాయి.. పాపం ఆ ఏనుగులకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఉన్న చోటును వదిలేసి కొత్త చోటుకు వెతుక్కుంటూ బయలుదేరాయి.. ఇప్పటికే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన ఆ ఏనుగులు పల్లెలు, పట్నాలు, నగరాలను అన్ని దాటుకుంటూ వెళుతున్నాయి.. ఎందుకు వెళుతున్నాయో, ఎక్కడికి వెళుతున్నాయో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ ఏనుగుల గుంపు చేస్తున్న పాదయాత్ర గురించి వీడియోలు, ఫోటోలు హోరెత్తుతున్నాయి. నెటిజన్లు కూడా తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతూ, ఆ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు.. అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఏనుగులపై ఓ కన్నేసి ఉంచింది..

సాధారణంగా ఏనుగులు అడవిని దాటి వచ్చాయంటే ఆహారం కోసమే అయి ఉంటుంది.. చిత్తూరులోనూ, శ్రీకాకుళంలోనూ ఏనుగుల గుంపు పంటపొలాలు ధ్వంసం చేస్తుండటం మనం విన్నాం. కన్నాం. అదేమిటో కానీ ఈ ఏనుగుల గుంపు మాత్రం అడవిని వదిలేసి నగరాల బట్ట పట్టాయి. ఏడాది నుంచి అవి ప్రజల మధ్యనే తిరుగుతున్నాయి. గుంపులో చిన్నా పెద్దా కలిపి మహా అయితే 15 ఏనుగులు ఉంటాయంతే. అవి ఎందుకు ఇలా ప్రయాణం సాగిస్తున్నాయో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. దారిలో ఎదురైన పంట పొలాలను ధ్వంసం చేస్తూ మరీ వెళుతున్నాయి. ఇప్పటికీ వాటి కారణంగా కోట్లాది రూపాయల నష్టం జరిగింది. ఇక నగరాలలో అయితే వాటి వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఆ ఏనుగులను ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అసలు ఇవి ఎందుకు ఇలా చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఓ ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసింది చైనా ప్రభుత్వం. ఇందులో 410 మంది సిబ్బంది ఉన్నారు. వీరి పనేమిటంటే వాటిని గమనించడం. వీటి కదలికలపై నిఘా పెట్టడానికి 14 డ్రోన్లను కూడా సాయంగా తీసుకుంటున్నారు. ఆహారం కోసమే ప్రయాణిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ మాట నిజమే అనుకుందాం. మరి ఆహారం పుష్కలంగా ఉన్న చోట అవి ఆగిపోవాలి కదా! ఎందుకు ఆగడం లేదని కొందరు సందేహపడుతున్నారు. గుంపుకు లీడర్‌గా ఉన్న ఏనుగుకు అంతగా అనుభవం లేకపోవడం వల్లనే అవి అడవి విడిచి రావాల్సి వచ్చాయని మరికొందరు అంటున్నారు. గత ఏడాది యువాన్‌ ప్రావిన్స్‌లోని అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగుల గుంపు ఇప్పుడు కున్మింగ్‌ నగరానికి దగ్గరలో ఉన్నాయి. అక్కడ ఇవి హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలు ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను… నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న వీడియో…

Radhe Shyam Movie: ఓటీటీ సంస్థల చూపు ‘రాధేశ్యామ్’ మూవీ పైనే.. ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చిన ప్రైమ్ ?