Bangladesh: సైన్యం చేతిలో బంగ్లాదేశ్‌ పాలన.. హసీనా రాజీనామాతో యువత సంబరాలు

|

Aug 06, 2024 | 7:24 AM

బంగ్లాదేశ్‌ సైన్యం కంట్రోల్‌లోకి వెళ్లడంతో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ వివరించగా.. అక్కడి పరిణామాలపై లోతుగా చర్చించారు.

Bangladesh: సైన్యం చేతిలో బంగ్లాదేశ్‌ పాలన.. హసీనా రాజీనామాతో యువత సంబరాలు
Bangladesh Crisis
Follow us on

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రభుత్వం వణికిపోయింది. వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి దేశ ప్రధాని కూడా గద్దెదిగాల్సి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే.. రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు రోడ్డెక్కారు.

బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు కూడా 30శాతం రిజర్వేషన్లను 5శాతానికి కుదించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇవ్వడంతో హసీనా ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాంతో.. పరిస్థితులు సర్థుకుంటాయని భావించినప్పటికీ.. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ప్రదర్శనలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలతో సుమారు 300మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగని నిరసనకారులు.. గత రెండు రోజుల్లో మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని వీధుల్లోకి వేలాది తరలివచ్చి రచ్చ చేశారు. దుకాణాలు, బస్సులకు నిప్పు పెట్టడంతో బంగ్లాదేశ్‌ రగిలిపోయింది. ఢాకా వీధుల్లో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికార నివాసంలోకి ప్రవేశించి రణరంగం సృష్టించారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి.. దేశం విడిచి వెళ్లిపోయారు షసీనా. దాంతో.. బంగ్లాదేశ్‌ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్లింది.

మరోవైపు.. బంగ్లాదేశ్‌ సైన్యం కంట్రోల్‌లోకి వెళ్లడంతో భారత్ అలెర్ట్ అయింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌లోని తాజా పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ వివరించగా.. అక్కడి పరిణామాలపై లోతుగా చర్చించారు. అదేసమయంలో.. భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. సరిహద్దుల్లో బలగాలను అప్రమత్తం చేయడంతోపాటు.. భద్రతను కట్టుదిట్టం చేసింది. కూచ్‌బెహార్‌, పెట్రాపోల్‌ సరిహద్దుల్లో భద్రత పెంచింది. సరిహద్దుల దగ్గర భారీగా సైన్యాన్ని మోహరించి.. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే.. భారత్‌లోని బంగ్లాదేశ్‌ ఎంబసీ దగ్గర భద్రత పెంచడంతోపాటు.. బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ కార్యాలయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. బంగ్లాదేశ్‌లో సరిగ్గా 49ఏళ్ల క్రితం ఇంతకంటే దారుణం జరిగింది. 1975 ఆగస్టులో అప్పటి రాజకీయ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహ్మన్‌, అతని ఫ్యామిలీతోపాటు.. 18 సీనియర్‌ సైనిక అధికారులను దుండగులు హత్య చేశారు. దాంతో.. హసీనా, ఆమె భర్త, పిల్లలు ఢిల్లీలో ఉండేందుకు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సాయం చేసింది. ఇప్పుడు.. సరిగ్గా 49 ఏళ్లకు 10 రోజుల ముందు అదే బంగ్లాదేశ్‌లో దాదాపు సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మహా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ముజిబుర్ కుమార్తె హసీనా బంగ్లాదేశ్‌ను వీడి.. భారత్‌కు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అప్పటిలాగానే.. హసీనాకు భారత్‌ ఆశ్రయం కల్పించింది. మొత్తంగా.. బంగ్లాదేశ్‌లో ఊహించని పరిస్థితులు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పారిపోయి భారత్‌కు వచ్చిన హసీనా.. ఇక్కడే ఉంటారా?.. లేక.. లండన్‌ వెళ్లిపోతారా?.. అన్నది చూడాలి.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..