AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి సంక్షోభం అంచుల్లో బంగ్లాదేశ్‌.. రాజీనామా చేసే యోచనలో మహ్మద్ యూనస్‌?

పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డట్లే ఉంది బంగ్లాదేశ్‌ పరిస్థితి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో యూనస్‌ తన పదవికి రాజీనామా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో దేశంలోని రాజకీయ పార్టీలతో పనిచేయడం తనకు సౌకర్యంగా లేదని ముహమ్మద్ యూనస్ భావిస్తున్నట్లు సమాచారం.

మరోసారి సంక్షోభం అంచుల్లో బంగ్లాదేశ్‌.. రాజీనామా చేసే యోచనలో మహ్మద్ యూనస్‌?
Nobel Laureate Professor Muhammad Yunus
Balaraju Goud
|

Updated on: May 23, 2025 | 12:12 PM

Share

పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డట్లే ఉంది బంగ్లాదేశ్‌ పరిస్థితి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ రాజీనామాకు సిద్ధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో యూనస్‌ తన పదవికి రాజీనామా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ త్వరలో ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. చైనా ఒడిలో కూర్చొని భారతదేశానికి ఉద్రిక్తత సృష్టిస్తున్న యూనస్ ఇప్పుడు సొంత దేశంలోనే చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ‘మీరు విత్తినట్లే, ఫలితం కూడా అలాగే ఉంటుంది’ అని అంటారు. భారతదేశాన్ని సవాలు చేసిన యూనస్‌ను ఇప్పుడు సొంత దేశ రాజకీయ పార్టీలు, సైన్యం సవాలు చేస్తున్నాయి.

యూనస్ రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు బంగ్లాదేశ్‌లోని విద్యార్థి ఉద్యమం నుండి ఉద్భవించిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సిపి) అధిపతి నహిద్ ఇస్లాం అన్నారు. రాజకీయ పార్టీలు పరస్పర ఏకాభిప్రాయానికి వచ్చే వరకు తాను పని చేయలేనని చెప్పినట్లు ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశంలోని రాజకీయ పార్టీలతో పనిచేయడం తనకు సౌకర్యంగా లేదని ముహమ్మద్ యూనస్ అంటున్నారని, ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు నహిద్ ఇస్లాం తెలిపారు.

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తర్వాత యూనస్‌ ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెబుతున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో చేతులు కలిపారు యూనస్‌, ఆర్మీచీఫ్‌. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య గ్యాప్‌ పెరిగింది.

గతేడాది ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలతో తీవ్ర హింస చెలరేగింది. రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగింది. ఘర్షణల్లో దాదాపు వంద మంది పౌరులతోపాటు కొందరు పోలీసులు కూడా మరణించారు. దీంతో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం సైనిక రక్షణతో ఆమె భారత్‌కు చేరుకున్నారు.

సంస్కరణలు చేపట్టి, త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహించారు. అయితే ఎన్నికల నిర్వహణలో జాప్యంతో పాటు, జైళ్లలో ఉన్న ఇస్లామిస్ట్ నాయకులు, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడాన్ని ఆర్మీ చీఫ్‌ వ్యతిరేకిస్తున్నారు. మయన్మార్‌ సరిహద్దుల్లో రఖైన్‌ కారిడార్‌ ప్రతిపాదనని ఆర్మీ వ్యతిరేకించటంతో యూనస్‌ సర్కారు వెనక్కి తగ్గింది.

బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించకుండా మరింత కాలం అధికారంలో కొనసాగేందుకు యూనస్‌కు అమెరికాకు వత్తాసు పలుకుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తక్షణం ఎన్నికల నిర్వహణకు తాత్కాలిక ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామాలతో పదవినుంచి తప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నారు యూనస్‌. అదే జరిగితే బంగ్లాదేశ్‌ సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.