Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హింసాకాండ.. 127 మంది మృతి..

|

Oct 02, 2022 | 7:23 AM

ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. సరదాను పంచాల్సిన మ్యాచ్ ఒక్క సారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది.

Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హింసాకాండ.. 127 మంది మృతి..
Indonesia
Follow us on

ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ తీవ్ర విషాదానికి దారితీసింది. సరదాను పంచాల్సిన మ్యాచ్ ఒక్క సారిగా యుద్ధవాతావరణాన్ని తలపించింది. వినోదం కోసం జరిగిన మ్యాచ్‌లో బీభత్సం, హింసా కాండ నడిచింది. ఏకంగా 127 మంది ఫ్యాన్స్‌ చావుకు కారణమైంది. అరెమా – పెర్సెబయా మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా వివాదం జరగడంతో ఇరు జట్ల ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలోకి దూసుకెళ్లారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితి మరింత అదుపు తప్పటంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఒక్కసారిగా ఫ్యాన్స పరుగులు తీయడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. మరోవైపు టియర్ గ్యాస్ కారణంగా గాలిలో ఆక్సిజన్ అందక ఏకంగా 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 180 మందికి పైగా ఫ్యాన్స్ గాయపడ్డారు.

తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI లిగా 1 ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని ఇండోనేషియా పోలీసు చీఫ్ నికో అఫింటా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. అరేమా ఎఫ్‌సి – పెర్సెబయా సురబయా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా దాడికి దిగారని తెలిపారు. దీంతో అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని, ఇది కాస్త తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఈ హింసాకాండలో చాలామందికి ఊపిరాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చనిపోయిన 127 మందిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారన్నారు. ముప్పై నాలుగు మంది స్టేడియం లోపల మరణించారని.. మిగిలిన వారు ఆసుపత్రిలో మరణించారని అఫింటా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. మ్యాచ్‌ తర్వాత ఏమి జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించడానికి ఒక బృందం మలాంగ్‌కు బయలుదేరిందని తెలిపింది. కంజురుహాన్ స్టేడియంలో అరెమా ఎఫ్‌సీ జట్టు ఫ్యాన్స్‌ వల్లే ఇదంతా జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ అల్లర్ల తర్వాత లీగ్ గేమ్‌లను ఒక వారం పాటు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అరేమా FC జట్టు ఈ సీజన్‌లో మిగిలిన పోటీలకు ఆతిథ్యం ఇవ్వకుండా కూడా నిషేధం విధించారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఫుటేజీలో మలాంగ్‌లోని స్టేడియంలోని అభిమానులు గ్రౌండ్‌లోకి దూసుకుపోతుండటాన్ని చూడవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..