
కరువుకాటు నుండి గట్టెక్కడం కోసం నరులు పడరాని పాట్లు పడుతున్నారు.. వానదేవుడా..! కరుణించని వేడుకుంటూ వింత వింత పూజలు నిర్వహిస్తున్నారు.. ములుగు జిల్లాలోని దేవునిగుట్ట పైకి ముళ్లబాటలో నడుచుకుంటూ వెళ్లిన గ్రామస్తులు బండ పాయాసం పూజలు నిర్వహించి గ్రామస్తులు కప్పల్లా పాయసం నాకుతూ మొక్కులు మొక్కుకున్నారు.. గ్రామ దేవత ఆవహించి పూనకాలతో ఊగిపోవడం ఈ మొక్కల్లో ప్రత్యేకత. ఎల్ నినో ప్రభావంతో జనమంతా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.. సాగు సంక్షోభంలో చిక్కుకుంది.. దీంతో వర్షాల కోసం గ్రామీణ ప్రజలు పూర్వికుల ఆచారాలను పాటిస్తూ వినూత్న పూజలు నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లా కొత్తూరు గ్రామ పరిధిలోని దేవునిగుట్ట లక్ష్మినరసింహస్వామి ఆలయం వద్ద నిర్వహించిన వరదపాశం కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు..గ్రామంలో దొడ్రాయి వద్ద జలబిషేకాలు చేసి తడి బట్టలతో గుట్టపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.. గ్రామ దేవత ఆవహించి పూనకాలతో ఊగిపోవడం ఈ వేడుకలో ప్రత్యేకత…వరదపాయాసం కార్యక్రమం నిర్వహిస్తే ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయనేది ఇక్కడి ప్రజల నమ్మకం.
కొత్తూరు గ్రామం నుండి 4 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న గుట్టపై కాలినడకన వెళ్ళిన గ్రామస్తులు వినూత్న రీతిలో ఈ వేడుక నిర్వహించారు… బెల్లం, పాలు, కొబ్బెరతో దేవునికి నైవేద్యంగా పాయసం వండి ఓ పెద్దబండపై పోసి మోకాళ్ళపై కూర్చొని కప్పలవలే నాలుకతో నాకుతూ మొక్కులు చెల్లించారు.
ఇలా నైవేద్యం సమర్పించి నాలుకతో నాకడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం.. ఊరంతా కప్పల లాగా బండ పాయసం నాకడం ఓ విచిత్ర మొక్కుగా కనిపించింది.. ఈ మొక్కు సమర్పిస్తే ఖచ్చితంగా వానదేవుడు కరుణిస్తాడని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు.