
బెక్కీ జోన్స్ 2012లో మైగ్రేన్ తలనొప్పితో బాధపడినట్లు బీబీసీ కథనంలో ప్రచురించింది. అప్పట్లో ఆమెకు తీసిన బ్రెయిన్ స్కాన్ లో ఒక పెద్ద మచ్చ కనిపించగా, వైద్యులు దానిని ట్యూమర్గా భావించి, ఆమెను క్యాన్సర్ ఉందని నిర్థారించి, చికిత్స అందించడం మొదలుపెట్టారు. చికిత్స ఆపితే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు పదే పదే చెప్పడంతో, ఆమె ఏళ్ల తరబడి కీమోథెరపీ తీసుకుంది.
2025లో ఆమె వైద్య రిపోర్టులను పరిశీలించిన న్యూరోసర్జన్లు, రేడియాలజిస్టులు షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అసలు ఆమెకు ఎప్పుడూ బ్రెయిన్ క్యాన్సరే లేదని తేల్చి చెప్పారు! స్కాన్ను క్షణ్ణంగా పరిశీలించిన నిపుణులు.. ఆ మచ్చ క్యాన్సర్ ట్యూమర్ కాదని, అది ‘ట్యూమర్ఫ్యాక్టివ్ డిమైలినేషన్’ (Tumefactive demyelination) అని తేల్చారు. నరాల పొర దెబ్బతినడం వల్ల వచ్చే ఒక రకమైన వాపు సమస్య అనీ, దాని వల్ల మెదడులో గడ్డ లాంటి ఆకారం ఏర్పడి, స్కాన్లో చూసినప్పుడు ట్యూమర్లా కనిపించిందనీ వైద్యులు పొరపాటుగా క్యాన్సర్గా నిర్థారించారనీ తెలిపారు.
జోన్స్ కు ఆ నిజం తెలిసినప్పుడు ఉపశమనం కంటే తీవ్ర షాక్, వేదన మిగిలాయి. ఏళ్ల తరబడి తాను పడిన నరకం, శారీరక క్షోభ అంతా కేవలం ఒక తప్పుడు వైద్య నిర్ధారణ వల్లేనని, ఆ బాధనంతా తాను అనవసరంగా అనుభవించానని తెలుసుకుని మానసికంగా కుంగిపోయింది. కీమోథెరపీ చేయించుకోవాలని లేదంటే ప్రాణాలు పోతాయని వైద్యులు పదే పదే భయపెట్టారని జోన్స్ తెలిపింది. “ఆ నిజం తెలిసినప్పుడు అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి” అని ఆమె తరఫు న్యాయవాది టిన్స్లీ తెలిపారు.
“నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు. నా జీవితంలో పదేళ్లు ఏ కారణం లేకుండానే నరకాన్ని అనుభవించాను” అని జోన్స్ తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యానించినట్లు వార్తా సంస్థలు రాసుకొచ్చాయి. జోన్స్ విషయంలో విస్తుపోయే అంశం ఏంటంటే.. కీమోథెరపీ ఆగిపోయిన తర్వాతే అసలు కథ వెలుగులోకి రావడం. డాక్టర్లు ఇన్ని ఏళ్లుగా క్యాన్సర్ అని నమ్మి చికిత్స అందించిన ఆ అనారోగ్యం, అసలు క్యాన్సరే కాదని.. అది పూర్తిగా వేరొక సమస్య అని తెలుసుకోవడమే ఆమెకు అతి పెద్ద విధి వైపరీత్యంగా మిగిలింది.
అరుదైన వ్యాధులు లేదా అయోమయానికి గురిచేసే వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చినప్పుడు.. అవే రిపోర్టులను సెకండ్ ఒపినియన్ ద్వారా మరొక నిపుణుడు సరికొత్త కోణం నుంచి పరిశీలించినప్పుడే సరైన వైద్య నిర్ధారణ జరుగుతుందనే దానికి బెక్కీ జోన్స్ ఘటన ఒక హెచ్చరికలా నిలుస్తుంది.