
నేటి ఆన్లైన్ ఆహార డెలివరీల యుగంలో సమయానికి ఆహారం రాకపోవడం సాధారణ సమస్యే అయినప్పటికీ, గురుగ్రామ్లో ఇటీవల జరిగిన ఒక విచిత్ర ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్డర్ చేసిన డిన్నర్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆరా తీసిన ఓ కస్టమర్కు ఊహించని అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది?
రిషబ్ కౌశిక్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి 10:58 గంటలకు జొమాటో యాప్ ద్వారా ఒక దాబా నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేశారు. యాప్లో డెలివరీ పార్ట్నర్ ఇంటికి దగ్గరలోనే ఉన్నట్లు చూపించినప్పటికీ, ఎంతసేపటికీ ఇంటికి చేరుకోలేదు. అనుమానంతో మ్యాప్ని గమనించగా, డెలివరీ బాయ్ ఐకాన్ ఒకే చోట దాదాపు 40 నిమిషాల పాటు కదలకుండా నిలిచిపోయింది.
ఆర్డర్ రాకపోవడంతో విసిగిపోయిన రిషబ్, లైవ్ లోకేషన్ ఆధారంగా నేరుగా ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆర్డర్ చేసిన డిన్నర్ బాక్సులను ఇద్దరు వ్యక్తులు తెరచి ప్రశాంతంగా తింటున్నారు. అసలు విషయమేంటని విచారించగా, డెలివరీ ఏజెంట్ ఆ ఆహారాన్ని మరొకరి వద్ద రూ. 100కి అమ్మేశాడని ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, మ్యాప్ స్క్రీన్షాట్లను రిషబ్ X వేదికగా పంచుకున్నారు. ఇది కేవలం ఫుడ్ డెలివరీ కాదు, ఫుడ్ షేరింగ్ ఎకానమీగా మారిపోయింది అని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ను ఉద్దేశించి వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
I ordered from Khadak Singh Ka Dhaba through @zomato at 10:58 PM. Didn’t receive it but the app told me that the delivery guy is nearby. Went to track my order and, instead of finding my food, I found the delivery partner’s location, and apparently, two people were enjoying my… pic.twitter.com/i0EAdY3aib
— Rishabh Kaushik (@RishabhKaushikk) September 6, 2026
ఈ వైరల్ పోస్ట్పై జొమాటో కేర్ స్పందిస్తూ, వెంటనే ఆర్డర్ వివరాలను పంపాలని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ పోస్ట్ను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాత్రిపూట ఆర్డర్లు చేసేటప్పుడు భద్రత మరియు మానసిక ప్రశాంతత కోసం క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకోవడమే మంచిదని కొందరు సలహా ఇచ్చారు. ఆన్లైన్ ఆహార సరఫరా వ్యవస్థల్లో కస్టమర్ భద్రత, సేవా ప్రమాణాల గురించి ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..