
సిరిసిల్ల పట్టణంలోని బిజీ ప్రాంతమైన గాంధీ చౌక్ వద్ద ఉన్న కుబేర క్లాత్ షోరూం భవనం పైభాగానికి ఒక శునకం అనుకోకుండా చేరుకుంది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత దానికి కిందికి దిగే మార్గం కనిపించలేదు. ఎటు కదలలేని పరిస్థితిలో, ఎండ తీవ్రతకు భయంతో ఆ మూగజీవం అక్కడే ఉండిపోయింది. కాపాడమంటూ అది చేసిన ఆర్తనాదాలు, అరుపులు కింద ఉన్న స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. భవనం అంచున ప్రమాదకరంగా నిల్చున్న ఆ శునకాన్ని చూసి స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఫైర్ టీమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. భవనం పైకి చేరుకున్న సిబ్బంది, భయంతో ఉన్న ఆ శునకాన్ని తాళ్ల సహాయంతో ఎంతో చాకచక్యంగా, సున్నితంగా తమ అదుపులోకి తీసుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ రెస్క్యూ ఆపరేషన్ను చూడటానికి గాంధీ చౌక్ వద్ద స్థానికులు, పాదచారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శునకానికి ఎక్కడ దెబ్బ తగులుతుందోనని సుమారు గంటపాటు ఈ ఆపరేషన్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఫైర్ సిబ్బంది ఆ కుక్కను క్షేమంగా కిందికి దించడంతో అక్కడ చేరిన వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ మూగజీవానికి ప్రాణదానం చేసిన అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తిని, వారి సేవలను స్థానికులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ ఘటన పట్టణంలో అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..