
ఛతర్పూర్, ఆగస్ట్ 23: మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఛతర్పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతుల్లో తొమ్మిది నెలల పసికందు కూడా ఉంది. ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు ఇప్పటికే పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఛతర్పూర్ జిల్లా ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపోరా ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతులను బాల్ముకుంద్ కుష్వాహా కుమార్తెలు ఏడేళ్ల పూనమ్, మూడేళ్ల మనీషా, తొమ్మిది నెలల చాహత్గా గుర్తించారు. గ్గురు చిన్నారులు గురువారం రాత్రి వంకాయ భర్తా, రొట్టె తిన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే వారు మృతి చెందినట్లు సమాచారం. అయితే చిన్నారుల మృతికి వారు తిన్న ఆహారమే కారణమా? అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హారం విషపూరితం కావడం, ఇతర అనారోగ్య కారణాలు లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారులు మృతి చెందిన విషయం ఆలస్యంగా అధికారుల దృష్టికి వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను పాతిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలియడంతో స్థానిక పోలీసులు, వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని సమాధి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఛతర్పూర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆర్పీ గుప్తా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలను కూడా అక్కడికి రప్పించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వైద్య, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా చిన్నారుల మృతికి అసలు కారణం ఏమిటో నిర్ధారించే అవకాశం ఉంది.
చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే ముందు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు చిన్నారుల మృతికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.