Telangana: ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత..వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు..

తెలంగాణలో తన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ట్యాంక్‌బండ్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై మాట్లాడేవారి గొంతుక..

Telangana: ట్యాంక్‌బండ్‌ వద్ద ఉద్రిక్తత..వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు..
Y S Sharmila
Follow us

|

Updated on: Dec 09, 2022 | 3:07 PM

తెలంగాణలో తన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ట్యాంక్‌బండ్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ప్రభుత్వం ప్రజాసమస్యలపై మాట్లాడేవారి గొంతుక నొక్కెస్తోందని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని సీఏం కేసీఆర్‌ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతపాలనకు ఇదే నిదర్శనమని విమర్శించారు. పాదయాత్ర కి అనుమతి ఇవ్వక పోవడంతో అంబేడ్కర్ విగ్రహనికి వినతి పత్రం ఇచ్చి దీక్షకు దిగారు షర్మిల. తన పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు.  అయితే షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ నెల 4వ తేదీ నుండి నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి నుండి పాదయాత్రను పున: ప్రారంభించాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. అయితే పాదయాత్రకు సంబంధించి వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. డిసెంబర్ 3వ తేదీన పాదయాత్రకు అనుమతిపై వైఎస్ఆర్‌టీపీ ధరఖాస్తు చేసింది. డిసెంబర్ 3వ తేదీ రాత్రి పోలీసులు వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు. గతంలో పాదయాత్రకు అనుమతిని ఇస్తే జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మరోసారి పాదయాత్రకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వైఎస్ఆర్‌టీపీకి డిసెంబర్ మూడో తేదీ రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో డిసెంబర్ 4వ తేదీన ప్రారంబించాల్సిన పాదయాత్ర వాయిదా పడింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి వైఎస్ఆర్ టీపీ నేతలు వరంగల్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ టీపీ సమాధానంతో వరంగల్ పోలీసులు సంతృప్తి చెందలేదు. వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిల పాదయాత్రకు అనుమతిని ఇవ్వలేదు.

ఈ ఏడాది నవంబర్ 27న నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహించిన సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నవంబర్ 28వ తేదీన టీఆర్ఎస్ శ్రేణుల నిరసనల మధ్య షర్మిల పాదయాత్ర సాగింది. లింగగిరికి సమీపంలో షర్మిల బస చేసే బస్సుకు కొందరు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్‌టీపీ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నర్సంపేట నుండి షర్మిలను పోలీసులు హైదరాబాద్ కు తరలించారు. నర్సంపేటలో ధ్వంసమైన తమ వాహనాలతో ప్రగతి భవన్ వద్ద ధర్నాకు వెళ్లిన షర్మిలను పంజాగుట్ట నుండి క్రేన్ సహాయంతోనే పోలీసులు లిఫ్ట్ చేశారు. పంజాగుట్ట నుండి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా నవంబర్ 28వతేదీన పాదయాత్రకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు షర్మిల పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది.హైకోర్టు అనుమతిని ఇచ్చినా పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్‌టీపీ చీఫ్ షర్మిల పార్టీ నేతలతో సమాలోచనలు నిర్వహించారు. చివరిగా ఆమరణదీక్ష చేపట్టాలని నిర్ణించారు. అయితే షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..