Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో అసలేం జరుగుతోంది.. అసలు, సురేష్‌ సూసైడ్‌కి కారణమేంటి?

|

Aug 24, 2022 | 7:34 AM

IIIT-Basara: ఒక ఇష్యూ సద్దుమణిగింది అనుకునేలోపే మరో ఇష్యూ తెరపైకి రావడం, బాసర ట్రిబుల్‌ ఐటీ అగ్నిగుండంగా మార్చేస్తోంది. సమస్యలు పరిష్కారమయ్యాయ్‌, విద్యాలయం గాడిలో..

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో అసలేం జరుగుతోంది.. అసలు, సురేష్‌ సూసైడ్‌కి కారణమేంటి?
Basara IIIT
Follow us on

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీ అగ్నిగుండంలా రగిలిపోతోంది. జూన్‌లో చెలరేగిన మంటలు మూడ్నెళ్లుగా మండుతూనే ఉన్నాయ్‌. ఆ విద్యాలయంలో చదువుకోవాలన్నా, కడుపునిండా భోజనం చేయాలన్నా, కంటినిండా నిద్రపోవాలన్నా ఓ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యల సుడిగుండంలో నలిగిపోతున్నారు అక్కడి విద్యార్ధులు. ఒక ఇష్యూ సద్దుమణిగింది అనుకునేలోపే మరో ఇష్యూ తెరపైకి రావడం, బాసర ట్రిబుల్‌ ఐటీ అగ్నిగుండంగా మార్చేస్తోంది. సమస్యలు పరిష్కారమయ్యాయ్‌, విద్యాలయం గాడిలో పడుతుందనుకునేలోపు మళ్లీ సమస్య, ఒకటి కాదు వేల సమస్యలు బాసర ట్రిపుల్‌ ఐటీని చుట్టుముడుతున్నాయ్‌. కారణాలేవైనా నెలరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మరణించడం కలకలం రేపుతోంది.

సరిగ్గా నెలరోజులక్రితం ఫుడ్‌ పాయిజన్‌తో ఓ విద్యార్ధి మరణించడంతో చెలరేగిన గందరగోళం రోజుల తరబడి సాగింది. మళ్లీ గాడిలో పడుతుందనుకునేలోపు క్యాంపస్‌లో గంజాయి వాసన గుప్పుమంది. ఇద్దరు స్టూడెంట్స్‌ నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించిన రెండ్రోజుల్లోనే ఓ విద్యార్ధి ప్రాణాలు తీసుకోవడం కల్లోలం రేపింది. సివిల్‌ ఇంజనీరింగ్ స్టూడెంట్ సురేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించడంతో క్యాంపస్‌ మళ్లీ అగ్నిగుండంలా మారింది. సురేష్‌ ఆత్మహత్యతో బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగడంతో పరిస్థితి మళ్లీ అదుపుతప్పింది. సురేష్‌ ఆత్మహత్యకు అధికారుల ఒత్తిడే కారణమంటోన్న స్టూడెంట్స్‌, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా పోలీస్‌ పహారాలోకి క్యాంపస్‌ను నట్టేసి విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా చేశారని, ఇదే సురేష్‌ సూసైడ్‌కి కారణమంటున్నారు. అయితే, సురేష్‌ సూసైడ్‌కు పర్సనల్‌ రీజన్సే కారణమంటున్నారు పోలీసులు.