
కవ్వాల్ పులుల రిజర్వ్ జోన్ అభయారణ్యం నుంచి 18 గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియ వేగవంతం అయింది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీ పనుల పురోగతిని కవ్వాల్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఏం.డోబ్రియాల్ సమీక్షించారు. స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించారు. లబ్దిదారులతో సమావేశమై కావల్సిన సదుపాయాలపై ఆరా తీశారు.
పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపుపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరాతీశారు. తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో పాటు, మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు. ఇందులో భాగంగా పీసీసీఎఫ్ క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించారు.
2012 సంవత్సరంలో టైగర్ జోన్ పరిధిలోని గ్రామాలను దశలవారీగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ కింద మైసంపేట, రాంపూర్ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు స్వచ్ఛంగా సిద్ధమయ్యారు. అయితే ఈ గ్రామాల ఆదివాసీలకు పునరావాసం ప్యాకేజీని పూర్తిస్థాయిలో ప్రకటించకపోవడంతో గ్రామం విడిచి వెళ్లేందుకు నిరాకరించారు. గ్రామాల తరలింపు నిర్ణయాన్ని ఆదివాసీ, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి. అయితే కవ్వాల్ టైగర్ జోన్ లో పులులతోపాటు ఇతర వన్యమృగాల సంచారం పెరిగిపోతుండడంతో అక్కడ జనావాసాలు సురక్షితం కాదని అటవీశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం (NTCA) నిబంధనల ప్రకారం రెండు ప్రతిపాదనలతో అటవీశాఖ పనులను చేపట్టింది. గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏకమొత్తంగా రూ. 15 లక్షల పరిహారం అందిచాలని నిర్ణయించింది. దీనికి 48 కుటుంబాలు అంగీకరించి ఆ మేరకు పరిహారం స్వీకరిస్తున్నాయి. ఇక రెండవ ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు అవే 15 లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇల్లు నిర్మాణంతో పాటు వ్యవసాయ భూమిని అందించేందుకు అటవీశాఖ గిరిజనులను ఒప్పించింది.
రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలను పునరావాసం కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 14.2 కోట్లు మంజూరు చేసింది. కవ్వాల్ కు సమీపంలోనే అటవీ ప్రాంతం బయట కొత్త మద్ది పడగలో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 12.36 ఎకరాల్లో కాలనీ నిర్మాణం అవుతోంది. ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఇల్లు, 2.81 ఎకరాల సాగుభూమిని అందిస్తున్నారు. రెండు గ్రామాలకు చెందిన 142 కుటుంబాలను పునరావాసం కోసం ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 14.2 కోట్లు మంజూరు చేసింది. కాలనీలో సామాజిక ఏర్పాట్లు, పనుల తీరుగా లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పనులన్నీ పూర్తి కాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటుచేసి లబ్దిదారులకు అందిస్తామని పీసీసీఎఫ్ ఆర్.ఏం.డోబ్రియాల్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అయా గ్రామాల పునరావాసం, పరిహారం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కొద్ది రోజుల్లోగా మొత్తం పునరావాస ప్రక్రియ పూర్తవుతుంది. మిగిలిన అన్ని గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…