AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొస్తున్నాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, ఎన్ఎల్సీ (NLC) ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Kishan Reddy: తెలంగాణలో పెట్టుబడులకు  సిద్ధం ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Revanth Reddy Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2025 | 8:39 AM

Share

తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొస్తున్నాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, ఎన్ఎల్సీ (NLC) ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల తరపున పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంలో తెలంగాణ ప్రభుత్వం చొరవను ఆకాంక్షిస్తూ సీఎం దృష్టికి తీసుకువస్తున్నట్లు కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL).. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

కీలకమైన ప్రతిపాదనలు ఇవే:

  • తెలంగాణలోని అధిక సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
  • గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
  • క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు చేస్తాం.
  • ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా కేంద్ర ప్రభుత్వ బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేస్తాం.
  • ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం.. అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులు ఏర్పాటుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరమని.. కిషన్ రెడ్డి లేఖలో వివరించారు. ‘‘ఇందుకోసం మీరు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నాను. మీ జోక్యం చేసుకుని ఈ ప్రాజెక్టులు ఏర్పాటుచేయడానికి అంగీకరించి, సహకారం, అందించాల్సిందిగా మనవి చేస్తున్నాను.. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుంది.

తెలంగాణకు ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ సామర్థ్యం, హరితాభివృద్ధికి కేంద్రప్రభుత్వ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తాయి. దీంతోపాటుగా భారతదేశం సుస్థిర ఇంధన పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడానికి ఇదొక చక్కటి అవకాశం. భారతదేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం.

పర్యావరణ పరిరక్షణతోపాటుగా ఆత్మనిర్భరతతో కూడిన భవిష్యత్‌ను ఏర్పర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి మీ సహకారాన్ని కోరుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను.’’ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us